Sunday, May 10, 2020

సినీ రచయిత ఆత్రేయగారి గురించి.

'నీవు లేక వీణ పలుక లేనన్నది' 

కిళాంబి వెంకట నరసింహాచార్యులు ....... పేరు నోరు తిరగదేమో గానీ ,  ఆయన  వ్రాసిన   పాటలు మాత్రం   పది కాలాల పాటు , పది మంది నోట మరీ , మరీ  పాడబడుతూనే  వున్నాయ్ .  'పచ్చ గడ్డి కోసేటి  పడుచు పిల్ల' కు ,   'ఆడుతూ పాడుతూ'  పని చేసికునే  సామాన్యులకు సైతమూ సులభంగా అర్ధమయ్యే రీతిలో అసామాన్యమైన భావాల్ని పలికించిన 'ఆత్రేయ' - అందరికీ తెలిసిన ఆయన  పేరు .  ప్రొద్దున్నే 'శేషశైలవాసా , శ్రీ వేంకటేశ '  అని  దేవుణ్ణి కొలవాలనుకుంటే , ఆయన పాటే కొలువు ; 'కారులో షికారు కెళ్లే '  పడుచును ఆట పట్టించాలన్న  ఆయన  పాటే ;  'చిట పట చినుకులు పడుతూ వుంటే'  తడుస్తూ సింగారంగా  ఏదైనా పాడుకోవాలంటే  ఆయన పాటే. 'కనులు లేవని నీవు కలతపడవలదు’ అంధుల కైనా    'కనిపించి , కనువిందు  కలిగించు '  'శిలల పై శిల్పాలను ' -  'నా కనులు నీవిగా చేసి కొని చూడు '  అని  సాంత్వనం పలికేది  ఆ పూదోటే .   'రాతి స్థంభాలకే చేతనత్వం కలిగి సరిగమ పదనిస  స్వరములే'  పాడేలా  జాలువారింది  ఆయన కవితా ధాటే.  
 'పాల గుండె లో ఏది దాగుందో తెలుసునా ' ' నవ్వినా , ఏడ్చినా  కన్నీళ్లే వస్తాయి ; ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసునా'  అని అమాయకంగా ప్రశ్నిస్తూనే , 'మనసు మూగదే కానీ బాసున్నది దానికి' అన్న భావుకత ,  'మనసున్న మనిషికి సుఖం లేదంతే ' అన్న  వేదాంతం  పలికిందీ ఆయన మాటే.  'చెంగావి రంగు చీర కట్టుకున్న'  ' 'తెల్ల చీర కట్టుకున్న ' ' నీ సుఖమే నే కోరుతున్న'  అన్న నిస్వార్థ భావన , 'ఎనక  జనమ బాసలూ   ఎందరికి  తెలుసులే '  అని సతమత మయ్యే తపన, 'ఎవరి కోసం' ఈ భగ్న హృదయం అని భగ్గుమని రగిలే ఆవేదన -  అన్నీ  ఈ 'మనసు కవి'  మది  పూదోట విరిసిన  'తేట, తేట తెలుగు'  లే.
ఆయన సినీ ప్రస్థానం  లో  పాట , పాట  గా కందళించి, పాటపాట (కొంచం, కొంచం) గా అవఘళించి, గమ గమ    గుబాళించి -  చిరకాలం నిలిచిపోయే మనస్సు చివుక్కురుమనిపించే చివుళ్లు- ఇలా ఎన్నెన్నో. 
క్విట్ ఇండియా ఉద్యమం లో జైలు కెళ్ళిన  ఈ దేశ భక్తుడు నాటకాల  రచయిత గా రంగ ప్రవేశం జేసినా , సినిమాల్లో చిక్కుకు పోయాడు. చిత్రానికి తానే నిర్మాత అయినా, తనే స్వయంగా రాయగలిగినా , మరో  'మహా కవి'ని  ఆహ్వానించి , రాయమని కోరగల  మా దొడ్డ సంస్కృతి  ఈ మనసున్న మనిషిది . జయభేరి కి అర్వాచీనం కాని ఆయన  మాటలు వన్నె తెస్తే,   ఎదలు ద్రవించి ఏరులయ్యేలా మనసులు పిండే అయన సంభాషణలు  మంచి మనసులు నుండి ప్రేమ నగర్ వరకు. 
 'విధి చేయు వింతలన్నీ మతి లేని చేతలేనని ' వక్కాణిస్తూ  1989 లో ఆయన మనల్ను వీడిపోయారు . 
 ఆ జ్ఞాపకాలు మన మనసులను కలచి వేస్తుంటే ఎటునుండో  'పాడుతా తీయగా చల్లగా' అంటూ  ఆయన గొంతు మార్దవంగా విన్పిస్తోంది . 
                    ఆయన  పుట్టిన రోజు , ఈ రోజు .  
              అందుకే   ఈ అంకిత భావ కుసుమాల  రోజు (నిట్టూర్పు)

No comments:

Post a Comment