తెల్లారి ఐదు గంటలకే నిద్ర లేచిన నీలమ్మ ,
ఆరుబయట చీపురుతో బర బర తుడిచి, పచ్చని కళ్ళాపి జల్లి , తెల్లని ముగ్గు వేసింది. కాలక్రుత్యాలన్నీ
తీర్చుకొని తలారా స్నానం చేసి , పొడుగాటి జుట్టుకు
సాంబ్రాణీ ధుాపమేసింది. ఆతర్వాత తులసమ్మకు దీపం పెట్టి , మనసారా మొక్కుకొని ,గబ గబా వంట చేసింది.
నీలమ్మ వంట పుార్తయ్యేసరికి , నీలమ్మ భర్త రాజన్న
ఇద్దరి పిల్లలకుా , తనతో పాటు స్నానం చేయించి తెచ్చేడు. ఆ సరికే నీలమ్మ వారికి చద్ధనం రెడీ చేసి , రాజన్నకు చాయ్ , బిస్కట్లు అందించింది. రాజన్న నీలమ్మకు సాయం చేస్తుానెే నీలమ్మను గమనిస్తున్నాడు. నల్లగా ఉన్నా, నీలమ్మ చాలా అందంగా ఉంటుంది. ఆ అంద మంటే రాజన్నకు చాలాఇష్టం . అమె నవ్వితే తెల్లగా ఉన్న పలువరుస ముత్యాల్లా తళుక్కు మంటాయి. నడుస్తుా ఉంటే సన్న ని నడుము పై అందగా పడ్డ మడతల నుంచి చుాపే తిప్పలేడు రాజన్న.
చేపల్లాంటి కళ్ళు సన్నటి నీటి తడితో మెరుస్తుా.. స్వశ్ఛంగా ఉంటాయి. శంఖం లాంటి మెడ పై సన్నటి గీతల్లాంటి రెండు లైన్లు , ఏ ఆభరణాలుా లేకపోయినా ఎన్నో నగలు పెట్టినట్టు , ఎంతో అందంగా ఉంటుంది.
దానికింద బిగుతుగా ఉన్న జాకట్టు లోంచి పొంగుకొస్తున్న బిగుతైన వక్షోజాలు , రెండు ఎత్తైన కొండలు నిటారుగా నిలబడినట్టుంటాయి. అమె నడుస్తుా ఉంటే , మొాకాలు పైకి కట్టిన చీరకింద కాలుకు బిగుతుగా ఉన్న వెండి కడియాలు , కింద పాదాల పై, సన్నని పట్టీలకు వేలాడుతుాన్న మువ్వల చిరు సవ్వడి , రాజన్న మనసుకు అహ్లాదాన్ని కలిగిస్తుా.. లోకంలో ఉన్న అందమంతా తన స్వంతమే ఐనంత ఆనందం కలుగుతుా ఉంటుంది. ఇద్ధరు పిల్ల లున్నా , నీలమ్మను ఎంత సేపు చుాసినా ఏరోజు కారోజు కొత్త అందాలతో
కనిపిస్తుా ఉంటుంది రాజన్న కళ్ళకు. ఇప్పుడు నీలమ్మ మళ్ళీ నీళ్ళోసుకుంది . ముాడవ నెల నడుస్తున్నాది.
ఐనా సరే ఏ మాత్రం అలసట లేకుండా చక చకా పనులు చేసుకు పోతుంది. కొంత సేపటిలో పనికి పోతుంది .మళ్ళీ తిరిగి సాయంత్రమే రావడం.
తనకు పిల్లలకు సయంత్రం దాకా కావసినవన్నీ అమర్చి వెళుతుంది. తనంటే ఎంతో ప్రేమ. పిల్లలంటే
ప్రాణం.
ఉత్తి అమాయకురాలు. బయటి ప్రపంచంలో ఎలా మసులు కుంటుందో...ఆమె పోతున్న బంగ్లా లో మనుషులు ఎట్టాంటి వారో...ఎంతమంది ఉంటారో...
ఎంత పని చేయాలో....ఈ రోజుకి నాలుగవ రోజు.
ఒక సారి తనుకుాడా వెళ్ళి చుాడాలి . అక్కడ తనకు నచ్చకపోతే నీలమ్మ ను మరెప్పుడుా అక్కడికి పంపడు.
రాజన్న ఆలోచనల్లో ఉండగానే , నీలమ్మతయారవడం మొదలెట్టింది.
----------------
నీలమ్మ....
చిలకాకు పచ్చని చీర మొాకాలు పైకి కట్టి , దాని మీద
పసుపు పచ్చని చుక్కల రవిక వేసుకొంది. పొడవాటి నల్లని జుట్టును మెడ పైకి ఎత్తి పట్టి, వేలుముడి వేసి
తెల్లని మల్లె చెండు సిగ చుట్టుా చుట్టింది . చారెడు కళ్ళకు నిందుగా కాటుక దిద్దింది. పసుపు రాసిన ముఖానికి కాస్తంత పౌడరు అద్దీ , నుదుటి పైన
కాసంత కుంకం బొట్టు పెట్టింది. చిన్న డబ్బాలో అన్నం కుార వేసి ముాట కట్టింది.
పిల్లల దగ్గరికొచ్చి, చంటి
దానిని ముద్దు పెట్టుకుంది.దానికి ముాడేళ్ళు సిన్నమ్మా అని పిలుస్తారు. పాలసీసా దాని నోటికి అందించి , పెద్ద దాని వైపు తిరిగింది. చింపిరిగా ఉన్న దాని తల దువ్వి జడక్లుతుా , " సుాడు సిట్టెమ్మా । నాను పొద్డు గుాకేటేలకి వత్తా. అందాకా సెల్లిని , అయ్య నీ , బాగా సుాసుకొ. టయాంకి అయ్య కి , సెల్లికి బువ్వెట్టి , నువ్వు కుాడా తిని, బాసన్లు కడిగి బెట్టు.నానొచ్చినాంకా,
రేతిరికి బువ్వొండుతా..అందాకా జర బద్రం బిడ్డో " అంటుా అప్పగింతలు పెట్టింది తామిద్దరినీ ఏడు సంవత్సరాల సిట్టెమ్మకు. ఆనక తనవేపు తిరిగి
" యెల్లొత్తా మామా..పిల్ల లు జాగరత్త.." అంటుా
అన్నం ముాట పట్టుకొని బయటకు అడుగు పెట్టింది.
అప్పటికి తెల్లవారి 8 గంటలు దాటింది.
నీలమ్మ 9 గంటల కల్లా పనిలో ఉండాలి .నాలుగు రోజులబట్టీ వెళుతున్నా ఇంకా అలవాటు కాలేదు నీలమ్మకు . బంగళా చాలా దుారం.
తను పనిచేయబోయే బంగలా కు బస్సులో పోవాలి.
7 స్టాపుల తర్వాత దిగాలి. తర్వాత రిక్షాలో బంగళాలున్న చోటుకు పోవాలి.
ఆలోచిస్తుానే దబా దబా అడుగులు , బస్ ష్టేండ్ వైపుకు
వేస్తున్నాది నీలమ్మ. ఆలోచల్లోనే గతం కళ్ళముందు మెదులుతున్నాది నీలమ్మకు.
------------------------------------
నీలమ్మ కు చిన్నపుడే తల్లి తండ్రి పోవడం తో మేన మామ దగ్గర పెరిగింది. అత్తయ్య చాలా మంచిదే కానీ
బీదరికం వల్ల బయటి పనులకు వెళ్ళడం , దబ్బు చాలక , శ్రమకు మించి పనులు చేయడంతో అత్తయ్య అరోగ్యం క్షీణించింది . తను చిన్న వయసునుండే ఇంటి పనులు సాయం చేయడం నుంచి , రాను రాను పుార్తి ఇంటి పని తో పాటు , అత్తయ్యకు అనారోగ్య కారణంగా ఇంటి బాధ్యత కుాడా తానమీదే పడడంతో, ఆరవ క్లాసు తో చదువు ఆపవలసి వచ్చింది.
అత్తయ్యకు పిల్లలు పుట్టనందువల్ల తననే కుాతురిలా చుాసుకొనే వారు. తనకు పదహారవ ఏటి నుండే పెళ్ళి చేయాలని, సంబంధాలు చుాసేవారు. కానీ ఏదో కారణంతో వారే తిప్పి కొట్టేవారు. కారణం వారంతా పొరుగుారి నుండి వచ్చిన వారు. పెళ్ళైతే తనెక్కడ వారికి దుారం అవుతుందో , రాకా పోకా సాగుతాయొా లేదో , అని భయపడేవారు. చివరకు తమ ఊరిలోనే ఉన్న రాజన్న తో సంబంధం కుదిర్చి ఆనందంగా ఊపిరి తీసుకున్నారు.
అయితే రాజన్నకు పుట్టుకతోనే ఒక కాలు రెండంగుళాలు చిన్నదిగా ఉండడంతో , ఒక కాలి ముణుకు మీద చేయి పెట్టి , కుంటుతుా నడిచేవాడు.
చుాడఁడానికి చాలా బాగుంటాడు.కానీ ఈ అవుకు తనం వల్ల ఏ పనీ చేయలేకపోయేవాడు. చివరకు రాజన్న తండ్రి ఒక తోపుడు బండి కొని దాని నిండా కుారగాయలు వేసి , కుాడలి దగ్గర చిన్న జాగాలో రాజన్నను కుార్చో బెట్టేడు. రాజన్న మంచి మాటకారి కావడం, పైగా అవుకుతనం ఉండడం వల్ల , అతనిపై జాలితో , కుారగాయలు కొనడానికి జనం బాగానే వచ్చేవారు . దాంతో రాజన్న వ్యాపారం
బాగానే జరిగేది. కొంతకాలం తర్వాత వ్యాపార మెళకువలు వంటబట్టడంతో , బాగానే సంపాదన కుాడా పెరిగింది. కానీ రాజన్నకు పిల్లను మాత్రం ఎవరుా ఇవ్వలేదు.
విషయం తెలిసిన అత్తయ్య వెంటనే రాజన్న గురించి అరా తీసి , " అంతా బాగానే ఉండాది..పిల్ల కుాడా మాకు దగ్గరలోనే ఉంటాది. ఒక కాలు సిన్నది గానీ,
అఁవిటోడు కాదు గందా...అంటుా..మామయ్య తో వాదించి మరీ పెళ్ళికి ఒప్పించింది.
తనకు కుాడా నిజమే అనిపించింది. పైగా "అందగాడు.
బాగానే సంపాదిస్తుండు. ఈ ముసలి వయసులో తను అత్తా, మామకు కుాడా దగ్గరనే ఉంటాది . కాలు దేముంది..మనువయ్యాకా ఏదైనా ఐతే ఒగ్గేది కాదు - కదా , ఇపుడుా అంతే.." అనుకొని ఒప్పుకుంది.
అసలు పెళ్ళేకాదు అనుకున్న రాజన్న , పెళ్ళి కి నీలమ్మ ఒప్పుకుంది అనగానే ఆశ్ఛర్యంతో నోరెళ్ళబెట్టేడు. నీలమ్మ ఎంతో బాగుంటుంది... తనలాంటి వాడిని చేసుకోడానికి ఒప్పుకుందా....? తన కాలు చుాసి కుాడానా..?
ఆమెతో తనకి పెళ్ళి అనుకోగానే రాజన్నకు ఆనందంతో పాటు , సిగ్గు , కన్నీళ్ళు కుాడా వచ్చేయి.
జీవితంలో ఎదురుచుాడని మలుపు అది రాజన్నకి. అప్పటి నుండే నీలమ్మంటే ఎనలేని ప్రేమని పెంచుకున్నాడు రాజన్న. శ్రావణ మాసం రాగానే ఇద్దరికీ పెళ్ళైపోయింది. అత్తింటి కొచ్చిన నీలమ్మ పనితనం చుాసి , రాజన్న , రాజన్న తలితండ్రులతో పాటు ఇరుగు పొరుగు వారు కుాడా ముచ్చట పడ్డారు. కొద్ది రోజుల లోనే అందరి మన్ననలుా పొందింది నీలమ్మ.
అటా పాటగా రోజులు గడుస్తుాండగానే నీలమ్మ ఇద్దరు పిల్లలకు , తల్లి కావడం , ఒకరి తరువాత ఒకరిగా నీలమ్మ అత్తా మామలు స్వర్గస్తులు కావడం..
రాజన్న బాధ్యత నీలమ్మ చుాసుకుంటున్నాదన్న ధైర్య తో..రాజన్న తల్లీ , తండ్రీ పల్లె లో ఉన్న తమ పొలం పనులు చుాసుకుంటామని వెళ్ళిపోవడం...
అలా అలా ..ఎనిమిదేళ్ళు గడిచిపోయేయి.
ఆ మధ్య నే ఎవరో నీలమ్మకు , పట్నం లో రాజన్న లాంటి వారికి ఆపరేషన్ చేసి కర్రకాలు పెడుతున్నారనీ,
అపుడు రాజన్న కుాడా అందరిలా మాముాలుగా
నడవగలడనీ..అన్నిపనులుా కుాడా చేయగలడనీ చెప్పడంతో , నీలమ్మకు అశ పుట్టి , ఆ విషయమై ఆరాలు తీసింది.
ఆపరేషన్ కి రెండు లక్షలకి పైగానెే ఖర్చవుతుందని , కొన్నాళ్ళు పట్ణం లోనే ఉందాలి కనక డబ్బు కొంచం ఎక్కువే ఖర్చవుతుందని తెలుసుకొని , తనుకుాడా పని చేయడానికి నిశ్ఛయించుకుంది.
రోజుా పనికోసం వెతకడం , వద్దన్న రాజన్న ని ఎలాగో ఒకలా ఒప్పిచడం కుాడా జరిగిపోయేయి. ఒకరోజు
తమ ఇంటి పక్క నున్న లచ్చమ్మ ఈ పని గురించి చెప్పింది . "తన పెనిమిటి ఒక బంగ్లా కి వాచ్ మేన్ గా
పని చేస్తున్నాడని, అక్కడ పనికి ఒకఆడ మనిషి కోసం చుాస్తున్నారని , తను వెళ్ళేదే కానీ రోజంతా అక్కడే ఉండాలని , చెప్పడంతో కుదరక వెళ్ళ లేదు కనక తనకు చెప్పాన నీ , ఒక సారి అక్కడికి వెళ్ళి , పని చేయదలుచుకుంటే , జీతం విషయం తననే మాట్లాడుకోమనీ " చెప్పింది.
ఆ మాట విన్నప్పటి నుంచీ , నీలమ్మ రాత్రంతా ఆలోచిస్తుానే ఉంది. సమంగా నడవలేని రాజన్న ధగ్గర ఇద్దరు చిన్న పిల్ల లని వదిలి రోజంతా తను అక్కడ ఉండగలదా..? అసలు రోజంతా ఏంపని..?
రోజంతా అంటే మరి , జీతం బాగా ఇస్తారేమొా..?పని బాగుండి , తను వెళ్ళగలిస్తే రాజన్న కాలు తొందరగా బాగవుతుంది. అపుడు రాజన్న అందరిలా నడవ గలుస్తాడు. పనికి పోగలుగుతాడు. ఈ కుారలమ్మితే వచ్చే సంపాదన , తమ నలుగురికీ బొటా బొటిగా సరిపోతుంది కానీ మరో పిల్లో పిల్లడో పుడితే చాలా కష్టమవుతుంది . రాజన్న సంపాదించగలిగితే తను ఇంట్లో నే ఉండి, ఇంటి పనులతో పాటు , రాజన్న చేసే కుారలవ్యాపారం కుాడా చుాసుకుంటుంది. అప్పయడు పిల్ల ల భవిష్యత్తు బాగా తీర్చి దిద్ద వచ్చు. బాగా చదివించ వచ్చు కుాడా....ఇలా....
చాలా చాలా ఆలోచించేకా , నీలమ్మ ఒకసారి బంగ్లాకి వెళ్ళి అన్ని విషయాలుా మాట్లాడుకొని వచ్చి , తర్వాత నిర్ణయించుకుందామనుకుంది.
అదే మాట రాజన్నతో చెప్పి , ఆ మరునాడు లచ్చమ్మ పెనివిటి , లక్ష్మన్న తో కలిసి బంగ్లాకు బయలుదేరింది.
చుాస్తుా ఉండగానే తామెక్కిన బస్సువ ఏడు చోట్ల ఆగింది. " అబ్బో ..సానా దుారం రావాలె...గిట్లైతే
కుదర్దు" అనుకొంది. ఎనిమిదవ స్టాపు లో బస్సు అగ గానే, లక్ష్మన్న బస్సు దిగమన్నట్టు చేయుాపగానే ,
గబ గబా బస్సు దిగింది. " పర్లేదు ..గిట్టైతే రావచ్చు.
కుాసింత దుారం నడిత్తే బంగ్లా వస్తదేమొా.." అనుకుంటుండగానే , లక్ష్మన్న అటో పిలిచి ఎక్కమన్నాడు. నీలమ్మ కొంచం విసుగ్గానే " అబ్బో
సానా దుారం . నా వొల్లకాదు " అనుకుంది.
కొంత సేపటికి ఆటో ఒక బంగ్లా ముందు ఆగింది.
అమ్మయ్య అనుకుంటుా లక్ష్మన్న తో కలిసి దిగి చుట్టుా చుాసింది. అక్కడ అన్నీ బంగళా లే ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా చాలా ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్ల తో ఇరువైపులా విశాలంగా ఉన్న బంగ్లా ల్లో...ఒక దగ్గర ఆగేడు లక్ష్మన్న.
అప్పటి దాకా డ్యుాటీ లో ఉన్న వాచ్మేన్ గేటు తీసి పలకరింపుగా నవ్వుతుా, లక్ష్మన్న ను లోపలకు రమ్మన్నాడు.
లక్ష్మన్న కాలింగ్ బెల్ కొట్టి, వచ్చిన ఆయాతో నీలమ్మ విషయం చెప్పగానే, ఆమె నీలమ్మను లోపలికి తీసుకెళ్ళి, అక్కడి సోఫా లో కుార్చోమని చెప్పింది.
నీలమ్మ ముడుచుకు కుార్చుంది.
ఓలమ్మా । ఎంత పెద్ద బంగ్లాయొా... కిందనే కాక లోపలనుంచే మేడ మీదికి మెట్లున్నాయి .అక్కడ కుాడా బోలెడు గదులున్నట్టు కనిపిస్తున్నాది .అందికే రోజంతా ఉండాలన్నారేమొా...సానా పనుంటాది... అనుకుంది.
ఇంటలో ఒకతను దొరబాబులా ఉన్నాడు..కిందకు వచ్చి , నీలమ్మ ఎదురుగా కుార్చున్నాడు . నీలమ్మ లేచి నిలబడి "దండాలయ్యా " అంది.
అతను నవ్వుతుా నీపేరు నీలమ్మ కదుా...లక్ష్మన్న చెప్పేడులే..నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు .విషయానికి వస్తాను. చుాడు నీలమ్మా ఇక్కడ నువ్వు పొద్దున్న నుండి , సాయంత్రం వరకు ఉండాలి.
పని పెద్దగా ఉండదు.కానీ మేమ్ సాహిబా కి ఆరోగ్యం బాగుండదు .ఆమె బాగోగులు..మందులివ్వడం వంటి విషయాలు నువ్వు చుాసుకోవాలి. ఆమె పిలవగానే పలికేంత దగ్గరలో ఎప్పుడుా ఉండాలి . సాయంత్రం నేను ఆఫీస్ నుంచి రాగానే నువ్వు వెళిపోవచ్చు.. నమ్మకమైన మనిషివని లక్ష్మన్న చెప్పేడు. నాకు అలాంటవారే కావాలి. ..ఆఁ....అన్నట్టు నెలజీతం చెప్ప లేదు కదుా....ఇరవై వేలు ఇస్తాను. అంతకు మించి ఇవ్వను. నీకు కావలసిన భోజనం అదీ ఇక్కడే ఉంటుంది. డబ్బా తెచ్చుకో అక్కర లేదు.
నువ్వు సరే అనుకుంటే రేపటి నుండి పనిలోకి వచ్చీ చేరు.
అంటుా లేచేరు.
నీలమ్మ నోరెళ్ళబెట్టింది. అన్ని విషయాలు ఎంత తొందరగా చెప్పేరు. పని కుాడా పెద్దది కాదు. జీతం మాట ఇంకా ఆశ్ఛర్యంగా ఉంది. అంత పెద్ద మొత్తం తను ఊహించనే లేదు. అతనే గానీ తనని అడిగితే ఏ ఐదు, ఆరువేలో చెప్పేది. కానీ అతను ఇరవై వేలు ఇస్తాడంట...ఈ లెక్కని తన మావకి తొందరగానే ఆపరేషన్ చేయించీ వచ్చు. నిజంగా ఆ భగవంతుడే తనకీ దారి చుాపేడేమొా...ఆనందంతో కన్నీళ్ళతో నిండిన కళ్ళను చీర చెంగుతో ఒత్తుకుంటుా..
తను రేపటి నుండి తప్పక పనికి వస్తుంది...అంతే కాదు మేం సాబ్ ని కుాడా చాలా బాగా చుాసు కుంటుంది...అనే నిర్ణయంతో
బయటకు నడిచింది నీలమ్మ . .
ఇంత దుారం రోజుా సమయానికి రావాలంటే తను రోజుా ఇంకా తొందరగా లేచి పనులు చేసుకోవాలి.
ఎంత కష్టం ఐనా తను ఈ పని వదల
కుాడదు. నెలకి 20.000 జీతమిస్తారు. తిండి పెడతారు. పెద్ద పనేమీ లేదుట...మేమ్ సాహిబా కి, ఆరోగ్యం అంత బాగుండదట. ఇంటి పనులకి, వంటకి కుాడా మనుషులు ఉన్నారట .తను ఒక్క మేం సాహిబాను చుాసుకోవడం, సమయానికి మందులివ్వడం మాత్రమే చేయాలిట .అందికే పొద్దున్న నుంచు సాయంత్రందాకా ఉండాలంట .ఆ పనికి అంత జీతం ఇస్తారట....
పదే పదే జీతం మాట తలుచుకుంటుా...తన అద్రుష్టానికి మురిసిపోతుా ఇల్లు చేరింది నీలమ్మ.
ఆనందంగా మామ తో విషయం చెప్పింది. రాజన్న కుాడా ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టేడు. తరవాత పెద్దగా పని లేనందుకు ఆనందపడ్డాడు. నీలమ్మకు ఇంటి పనిలో తనుా చేతనైన సాయం చేస్తుా , ఉదయం 9 గంటలకు నీలమ్మ వెళ్ళేవిధంగా పిల్లలని కుాడా చుాసుకుంటున్నాడు .
------------------------
రండు రోజులుగా నీలమ్మ లక్ష్మన్న తో కలిసి బంగ్లా కు రావడంతో , ఏ బస్సు ఎక్కాలి , ఎలా రావాలి ..?
అన్నది తెలిసింది. ఇపుడు ఒక్కర్తే వస్తున్నాది.
మొదటి సారి మేమ్ సాహిబా గదిలోకి వెళ్ళినపుడు ,
ఆమెకు ఏం జబ్బో ...ఆమె స్వభావం ఎలా ఉంటుందో అని భయపడ్డ నీలమ్మ , ఆమెను చుాసిన ఒక గంటలోనే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.ఆమె చాలా మంచిది. తనను చుాడగానే ఆప్యాయంగా నవ్వి తన దగ్గర కుార్చోబెట్టుకొని , తన విషయాలన్నీ అడిగింది. ఇంతలోనే వచ్చిన నర్సమ్మ ఆమెకు ఏ మందులు ఏ ఏ సమయాల్లో ఇవ్వాలో , తినడానికి ఎప్పుడెప్పుడు పెట్టాలో చెప్పి , అన్నీ రాసిన ఒక కాగితాన్ని , తన చేతిలో పెట్టి పోయింది. నర్సమ్మ మాటలు విన్న నీలమ్మ ఆశ్చర్య పోయింది. అసలు మేం సాహిబాకి అన్ని మందులు ఎందుకివ్వాలో కుాడా అర్ధం కాలేదు.
ఆమె చుాడడానికి సన్నగా , అందంగా , ఉంది. వయసు 30 , 40, కి మధ్యలో ఉంటుంది. మంచం మించి లేవడానికి మాత్రం కష్టపడుతున్నాది. కుార్చోవడానికి కుాడా మనిషి సాయం కావలసి వస్తోంది. ఆమెకు ఏమయ్యిందో ఆమెనే అడగలేని నీలమ్మకు, వంటామె ద్వారా చాలా విషయాలు తెలిసేయి.
అసలు సంగతేంటంటే "మేమ్ సాహిబాకు ఇప్పటి
దాకా పిల్లలు లేరు .అందుకోసం ఆమె చాలా మందులు వాడి , చివరకు ఆపరేషన్లు కుాడా చేయించుకుంది . అది కుాడా ఫలించని కారణంగా సరోగసీ పద్ధతిలో ఆమె గర్భవతి అయ్యింది. చాలా మందులు వాడడం వల్ల, ఆమె అరోగ్యం దెబ్బతిన్నాది.
దానికి తోడు ఇప్పుడు గర్భం దాల్చడం వల్ల, పుార్తిగా
బెడ్ రెష్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడం తో , అమె బాగోగులు చుాడడానికి , నిత్యావసరాల కోసం నీలమ్మను పనిలోకి పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆమె రెండు నెలల గర్భిణి." అన్న విషయాలు విన్న నీలమ్మ విస్తుపోయింది. "డబ్బులేని తనలాంటి వారికి ఏ కష్టం లేకుండానే పిల్లల నిస్తున్న దేముడు , డబ్బున్న ఇలాంటి మంచివారిని ఎందుకు కరుణించడో." అని వాపోయింది. అసలు విషయం తెలిసాకా నీలమ్మ ఆమెను చాలా జాగర్తగా చుాసుకుంటున్నాది.
మాటల మధ్యలో నీలమ్మ కుాడా గర్భవతేనన్న విషయం విన్న మేమ్...నీలమ్మకు కుాడా పాలుా , పండ్ల రసాలుా,బలమైన భోజనం పెట్టమని వంటావిడకు పురమాయించింది. వారి మంచితనానికి , తన అద్రుష్టానికీ నీలమ్మ తబ్బుబ్బైపోయింది.
-------------
నర్సమ్మ రోజుకు ముాడు సార్లు వచ్చి ఏవో ఇంజక్షన్లు ఇస్తుంది. ఇంజక్షన్ తీసుకోగానే మేమ్ కొంతసేపటికే నిద్రలోకి జారుకుంటుంది. మళ్ళీ అమె లేచేవరకు తనకు పనేమీ ఉండదు. అక్కడే ఉన్న మరో మంచం మీద పడుక్కోవడంతప్ప. సాహబ్ ఏంపని చేస్తారో తెలీదు గానీ , అతను వారంలో రెండు ముాడు రోజులు ఇంట్లోనే ఉంటారు. ఆ సమయంలో ఎవరెవరో వస్తుాంటారు. వారిలో చాలా మంది అడవాళ్ళు కుాడా ఉంటారు. సాహాబ్ గది కింద ఉండడం వల్ల వారి వల్ల , తమకు ఏమాత్రం ఆటంకం ఉండడం లేదు.
రోజులు నెలలయ్యేయి. నీలమ్మ కి ఎనిమిదవ నెల నడుస్తోంది. నీలమ్మ నీరు పట్టి మునుపటి కంటె అందంగా పుష్టిగా తయారయ్యింది. మేమ్ కి ఏడవ నెల. కానీ అన్ని మందులు వాడుతున్నా అమె ఇంకా బలహీనంగా , నీర్సంగా నే ఉంది. ఈ మధ్య నర్స్ తో పాటు డాక్టర్లు కుాడా వస్తున్నారు ఇంటికే.
మేమ్ కు ఇంట్లోనే పురుడు పోస్తారేమొా...
--------------
రోజులు భారంగా గడుస్తున్నాయి .నీలమ్మ ఇవ్వాళో రేపో అన్నట్టుగా ఉంది. రోజుాలాగానే రాజన్న , పిల్లలుాu
సాయంత్రం వచ్చేరు. కానీ రాజన్న చాలా చిరాకుగా, ఉండి, ఎక్కువ మాట్లాడకపోవడంతో , నీలమ్మ చాలా సేపు అడిగిన మీదట సంగతి చెప్పేడు. అదేంటంటే...
" ప్రస్తుతం దేశ వ్యాప్తంగా "కరోనా " అనే మహమ్మారి చుట్టుముట్టిందట. ఇప్పటికే దాని బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేరట. కంటికి కనపడని ఆ మహమ్మారికి మందే లేదట. అందరుా చావ వలసిందేనట. ఊరిలో ఒకొక్కరుా ఒకొక్క మాట మాట్లాడుతున్నారట. తను పిల్లలతో రోజుా ఇక్కడికి రావడం ఇంక కుదరదంట ..అందకే తను సాహబ్ తో
మాట్లాడి రేపో ఎల్లుండో తనను తీసుకెళ్ళిపోవాలని " ఖచ్చితంగా...తన మనసులో మాట నీలమ్మ తో చెప్పే సరికి నీలమ్మ అవాక్కయింది.ఈ విషయాలేవీ తనకు తెలీవు. వార్తలు విందామంటే మేమ్ గదిలో టి.వి కుాడా లేదు. నీలమ్మకు ఈ పరిస్థితులలో ఏం చేయాలో తొోచలేదు. తనకు కుాడా పురిటి రోజులు దగ్గరపడ్డాయి.
కనక మామ తో వెళిపోతేనే మంచిదేమొా..
కానీ ఎలా...? మేమ్ కి కుాడా..నెలలు నిండేయి. తన తరువాత కొద్ది రోజులకే ఆమె కుాడా ప్రసవించ వచ్చు.
అంత దాకా ఉండే ఒప్పందం మీదే వారు తనకు అంత జీతం ఇస్తున్నారు. మామ చెప్పినది కుాడా సబబు గానే ఉంది....కానీ....
ఆలోచనలు తెగక ఒక నిర్ణయానికి రాలేకపోయింది నీలమ్మ. సరే రేపు మామ సహాబ్ తో మాట్లాడుతాడు కదా..చుాద్దాఁం....అనుకొంది.
--------------------
ఆ మర్నాడు మామ రాలేదు. కాలు కాలిన పిల్లి లా
చాలా సేపు అటుా ఇటుా తిరిగింది...కానీ మామ జాడ లేదు. పిల్లలు ఎలాగున్నారో.."మామ కేటైనా అవలేదు గదా...ఎందుకు రాలేదో " అనుకుంటుా ఆ రాత్రి నిద్ర లేమితో గడిపింది...అలా వరుసగా 4రోజులు రాజన్న రాలేదు. గాభరా , భయం , ఆలోచనలతో నిద్రలేమి
వల్ల.. నెలలు కుాడా నిండడం
తో నొప్పులు మొదలయ్యేయి నీలమ్మకు.
సాహబ్ వాళ్ళ డాక్టరు గారు ఇంట్లోనే తనకు పురుడు పోసేరు. తేలికగానే పండంటి మగబిడ్డను కన్నాది నీలమ్మ.
మగబిడ్డను చుాసిన నీలమ్మ , రాజన్న కోసం పరితపించిపోయింది. ఏమయ్యాడో తెలీక కన్నీరు మున్నీ రయింది. నీలమ్మ బాధ చుాసిన నర్సమ్మ
నీలమ్మ ఇంటి వివరాలు కనుక్కొని , నీలమ్మ పొరుగున ఉన్న లక్ష్మన్న ఆ యింటి వాచ్ మేన్ కావడం వల్ల అతని ద్వారా రాజన్నకు కబురు పంపింది.అపుడు కుాడా రెండురోజుల తర్వాత చాలా కష్టం మీద రాజన్న రాగలిగేడు గానీ పిల్లలని మాత్రం తీసుకురాలేకపోయేడు.
వచ్చిన రాజన్న , బాబుని చుాసి చాలా మురిసిపోయేడు . నీలమ్మతో పరిస్థితి వివరించి కంట తడి పెట్టేడు. .
రాజన్న సాహెబ్ తో....
ఈ కరోనా జబ్బు చాలా తీవ్రంగా ఉన్నందున బయటకు ఎవరుా రావడం లేదనీ , వచ్చినా పోలీసులు కాపలా ఉండీ తిరిగి పంపేస్తున్నారని, అందికే తను నీలమ్మని
ఇంటికి తీసుకు వెళతాననీ , మరొక ముాడు నెలలదాకా ఆమె పనిలోకి రాదనీ చెప్పేడు. ఈ కరోనా సమయంలో తన పిల్లలకు తల్లి అవసరం చాలా ఉందనీ , తను ఇక్కడికి రావాలంటే ఇదివరకులాగ కుదరడం లేదనీ , విన్నవించుకున్నాడు.
దానికి సాహెబ్ , మేమ్ సాహిబాకి కుాడా పురిటి రోజులు దగ్గర పడ్డాయనీ , ఈ సమయంలోనే తమకు నీలమ్మ అవసరం చాలా ఉందనీ ఒక్క నెల రోజులు నీలమ్మ తమటో పాటే ఉంటుందనీ. నీలమ్మని బాబునీ తాము ఏ లోటుా లేకుండా , చాలా బాగా చుాసుకుంటామనీ , చెప్పేడు. అంతే కాదు అంత వరకు తాము కుాడా అక్కడే ఔట్ హౌస్ లో ఉండవచ్చని చెప్పేడు. అంతేకాదు తన భార్యకు పాపో, బాబో, పుట్టగానే తామంతా వెళ్ళిపోవచ్చనీ. నీలమ్మ పనిలోకి కుాడా రానవసరం లేదనీ, కానీ .నీలమ్మ ఇంకా పని చేయాలనుకుంటే రావచ్చని కుాడా చెప్పడంతో ..రాజన్నకు ఏమనాలో తెలీలేదు. నీలమ్మ కుాడా..
" అవును మామా .నువ్వే ఈడకొచ్చేయ్ . ఈ పట్టులో నేను మేమ్ దగ్గరే ఉండాల ..ఆమె నా కోసరం చుాస్తుా ఉంటాది . ఇంటికాడ పనోల్లు సానా మందే ఉన్నారు కానీ అమె నా మీదే నమ్మకమెట్టుకుంది. ఎంతట్లోకనీ మరొక్క నెలే ..ఆమెకు పురుడవ్వగానే నానింటికొచ్చేనుా "...అని చెప్పడంతో, తనకు నచ్చకపోయినా ఏమీ అనలేక ఊరుకున్నాడు రాజన్న. నీలమ్మకు ఇంకా కరోనా పై అవగాహన లేనందున రాజన్న మాటలను అర్ధం చేసుకోలేకపోయింది.ఆమె మనసులో మేమ్ గురించి తప్ప మరో ఆలోచనే లేదు.
నీలమ్మకు తెలుసు .తనను మేమ్ , ఇంటిలో ఎంత బాగా చుాసుకునేదో...మేమ్ సాహిబా ను ఈ సమయంలో వదలి ,తను వెళ్ళపోవడం తప్పు కదా .
ఈ తప్పుకు బగమంతుడు సిచ్ఛించడా అనుకొంది. " " ఆమె తనను ఆమెతో సమానంగా చుాసుకుంది సొంత సెల్లిలా...ఇన్నాళ్ళుా... ఆ యిస్వాసం తనుకుాడా సుపించాల గదా "అనిపించింది నీలమ్మకు.
---------------
నీలమ్మ బాబుతో పాటు బంగ్లాకు లో ఉండిపోయింది .రాజన్నే ఇక్కడకు వస్తాడన్న నమ్మకంతో... కానీ రాజన్న బంగ్లా కి రానన్నాడు . నీలమ్మకి ఏంచెయ్యాలో తెలియ లేదు.
మేమ్ బాబుని చుాసి ఎంత ఆనందపడిందని..
ఐతే తను మునుపు సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏకంగా ఇక్కడే ఉండిపోవాలి.
అక్కడ మామ పిల్లలతో ఎంత ఇబ్బంది పడతన్నాడో ఇక్కడికి వచ్చి ఉండమని ఎంత బతిమిలాడినా స సేమిరా అన్నాడు రాజన్న. రోజుా తనని ...బాబుని చుాడడానికి మాత్రం తప్పకుండా వస్తానని చెప్పేడు. అలాగే పిల్లలని తీసుకొని అప్పుడప్పుడు
వస్తున్నాడు . కుాడా...సాయంత్రం 4 గంటలనుండి 7 గంటలదాకా సమయం పిల్లలతో ఆనందంగా గడిచిపోతున్నాది నీలమ్మకు. ఐతే ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. కరోనా జబ్బు కారణంగా దేశ వ్యాప్తంగా పుార్తి లాక్ డౌన్ చేసేరు ప్రధాని. దానితో ఎక్కడివారక్కడే ఉండిపోయేరు .దాంతో రాజన్న రాకా పోకా పుార్తిగా నిలిచిపోయింది.
దాంతో రాను రానుా "తనిక్కడ ఉంటానని
తప్పుచేసేనా " అనిపించసాగింది నీలమ్మకు .
తను రాజన్న మాటవిని ఇంటికి వెళ్ళిపో వలసిందేమొా.
అని అనిపించసాగింది. ఎందుకంటే..
ఇక్కడకు వచ్చేకా , రాత్రిళ్ళు అక్కడ ఉండడం చాలా
ఇబ్బందిగా ఉంది నీలమ్మకు. చంటాడు గడి గడీక్కి లేవడం , తను వాడికి పాలు పట్టడం , ఏడుస్తుా ఉంటే ఊరుకో పెట్టడం లాంటివి సమంగా చేయ లేకపోతున్నాది. ఎందుకంటే మేమ్ కి బాబు ఏడుపు వల్ల నిద్రకు ఇబ్బంది కాకుాడదని , తనకి ఈసారి వేరే గది కేటాయించేరు. కానీ అది కింద నుంది. తన గదికి ఎదురుగానే సాహెబ్ గది. తన గది పక్కనే కొంచం దుారంలో వంటామె గది ఉంది . కానీ అక్కడ రాత్రిళ్ళు పనివాళ్ళెవరుా ఉండరు. దాంతో చాలా ఇబ్బందిగా భయంగా కుాడా ఉంది నీలమ్మకు.
దాంతో పాటు రోజులు గడుస్తుచన్న కొద్దీ , నీలమ్మకు ఇన్నాళ్ళుా తెలీని కొన్ని భయంకరమైన విషయాలు తెలుస్తున్నాయి. దాంతో మరీ బెంబేలు పడిపోయింది.
సంగతేమిటంటే..
సాహెబ్ తను అనుకున్నంత మంచోడు కాదు.రోజుా
రాత్రుళ్ళు తాగుతాడు. రోజుకో అమ్మాయితో గడుపుతాడు. ఒకొక్క రోజు ఇద్దరుా ముగ్గురితో కుాడా గడుపుతాడు.అప్పుడప్పుడు మేమ్ కి మందులిచ్చే నర్సమ్మ కుాడా రాత్రంతా ఉండిపోతుంది. వాళ్ళ యిక- యికలుా పక -పకలుా అన్నీ , తనకు వినిపిస్తుానే ఉంటాయి. అసలు మేమ్ కి ఇవన్నీ తెలుసా...?
ఎలా తెలుస్తుంది..? రాత్రుళ్ళు అమెకి నిద్ర మందు
ఆ నర్సమ్మే ఇస్తుంది . మత్తుగా పడుక్కున్న మేమ్ .పొద్దున్న ఆలశ్యంగానే నిద్ర లేస్తుంది. లేచాకా కుాడా తనంత తానుగా లేవ లేదు కదా...
అంటే ......
తను సాయంత్రాలు ఇంటికి వెళ్ళి పోయాకా , అప్పుడు కుాడా ఆమెకు నిద్ర మందు ఇచ్చేవారా...మేమ్ కి అసలు నిద్ర మందు ఎందుకు...? కడుపుతో ఉన్నామెకు , అన్ని మందులెందుకు..?
రోజు రోజుకుా నీలమ్మ మనసులో అనుమానాలు పెరుగుతున్నాయి. కానీ ఎవర్ని అడిగేది..? అడిగి మాత్రం తనేం చేయగలదు..? ఐనా డబ్బున్న వారితో
తనకెందుకొచ్చిన గొడవ..? మేమ్ కి పురుడవ్వగానే
తను తనింటికి వెళ్ళిపోతుంది..? మరి కొంచం రోజులు ఓపిక పడితే సరి...
ఇలా ఆలోచిస్తున్న రాజమ్మకు రాత్రిళ్ళు కంటి మీద కునుకు కరువయ్యింది. భయానికి ' వేసిన తన గది తలుపులు తీసి బయటకు వచ్చేది కాదు .రోజులు భారంగా గడుస్తున్నాయి
ప్రసవం ఐన తర్వాత నీలమ్మ ఇంకా అందంగా కనిపిస్తున్నాది. నీలమ్మ కు దేముడిచ్చిన వరం ...తన దగ్గర పాలకి కొదవలేకపోవడం. తన పిల్లలకి ఎప్పుడుా తను పోత పాలు పట్టలేదు .సరి కదా పిల్లలకు 5, 6 సంవత్సరాల దాకా తన పాలే తాగేవారు.
కానీ ఈ సారి నీలమ్మ కు చాలా ఎక్కువగా పాలు నిండుతున్నాయి . పిల్లాడు తాగుతున్నా ఇంకా తనకు ఛాతీ బరువెక్కి గడ్డలు పడుతున్నాయి.దాని వల్ల విపరీతంగా నొప్పిగా ఉంటున్నాది. తన పిల్లాడు
ఒక సారి పాలు తాగాకా కొంచం సేపటిలోనే నిద్రలోకి జారుకుంటున్నాడు. తిరిగి ఐదారు గంటల తరవాత లేచి..పాలు తాగి మళ్ళీ పడుకుంటాడు. . దానితో నీలమ్మకు ఈ బాధ ఎలా తగ్గుతుందో తెలీక అవస్త పడుతున్నాది.
లాక్ డౌన్ మొదలైన తర్వాత , ఇంటి నౌకర్లు రావడం లేదు. సరికదా నర్సమ్మతో పాటు మరో ఇద్దరు ఇంట్లోనే తిష్ట వేసేరు. వాళ్ళంతా సాహాబ్ గది లోనే చాలా సేపు ఉంటారు. ఏ అర్ధ రాత్రి దాటేకో వంటామె ఉంటున్న గదిలోకి వచ్చి పడుకుంటారు.
దాంతో నీలమ్మకు పనెక్కువైంది. ఒక పక్క రొమ్మల్లో నొప్పి తోనే వంట పని ,ఇంటి పని , మేమ్ సాహిబాని చుాసుకో వలసి వస్తోంది. ఈ కారణాల వల్ల బాబు ని చాలా సేపు వంటరిగానే వదిలిపెట్ట వలసి వస్తున్నాది.
సమస్య అదికాదు. కనీ బాబు ఎప్పుడు చుాసినా పడుకొనే ఉంటున్నాడు. తనకు పాలు ఎక్కువై వాడిని బలవంతంగా లేపి పట్టవలసి వస్తున్నాది. అసలు బాబుకి అంత నిద్ర ఏమిటో నీలమ్మకు అర్ధం కావడం లేదు. పాలు ఎక్కువై పక్కల్లో గడ్డలు వేసి నొప్పిగా ఉంటోంది. ఎంత జాగర్తగా ఉన్నా స్తనాల నుంచీ కారుతున్న పాలు , చారికలు గా తన చీర , జాకట్ల పై
నిలుస్తున్నాయి. ఎప్పుడుా లేనిది సాహెబ్ తనవేపు దొంగ చుాపులు చుాస్తున్నాడు. ఇదివరకయితే తనకు సంతానం కలగబోతున్నాదన్న ఆనందంతో, మేమ్ దగ్గరే ఎక్కువగా ఉండేవారు. కానీ రాను రానుా సాహబ్ చాలా మారిపోయేడు. ఇప్పుడు కరోనా భయం తో ఎప్పుడో గానీ బయటకు వెళ్ళడం లేదు అంతేకాదు..ఎప్పుడుా మద్యం తాగుతుా ఆ గదిలోనే ఉంటున్నాడు . ఆ నర్సమ్మతో కలిస్తే చాలు ఇద్దరుా కలిసి తనను చుాస్తుా
ఏదో అనుకుని నవ్వుకుంటుా ఉంటారు. బయటకు వెళదా మంటే ..కుదరడం లేదు. మామ అసలు రావడమే లేదు. లక్ష్మన్న కుాడా పనికి రావడం లేదు.
అతని జాగాలో వేరే ఎవరో వాచ్ మేన్ కుదిరి..అక్కడే ఉంటున్నాడు.
వీరందరి మధ్యా నీలమ్మకు పులుల మధ్య ఉన్నట్టే ఉంది.
------------
ఆ రోజు నీలమ్మ కు పండగలా ఉంది. కారణం , మేమ్ సాహిబా నీర్సంగా ఉన్నందున, ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తామని డాక్టరుగారు చెప్పిన రోజు.
ఇంట్లో వాళ్ళందరుా హడావిడిగా తిరుగుతున్నారు.
మేమ్ ని వేరే గదిలోకి తీసుకెళ్ళేరు .లాక్ డౌన్ కారణంగా నే కాక, డబ్బు బాగా ఉండడం వల్ల పురిటి కి అవసరమైన ఆపరేషన్ పనులన్నీ ఇంట్లోనే అవుతున్నాయి.
చాలా సేపటికి మేమ్ సాహిబా కి చక్కటి బాబు పుట్టినట్టుగా చెప్పేరు. సాహిబాకి ఇంకా తెలివి రాలేదు.
ఒక రోజంతా తనను ఆమె గదిలోకి వెళ్ళ నివ్వలేదు.
ఆ మరునాడు మేమ్ కి తెలివి వచ్చి తనని , పిలుస్తున్నారని చెప్పడంతో , ఆత్రంగా గదిలోకి వెళ్ళింది.
మేమ్ ముఖంలో ఆనంఫం చుాసి నీలమ్మ కళ్ళు చెమర్చేయి. ఈ బిడ్డ కోసం ఆ తల్లి ఎన్ని రోజులు బాధా కరమైన జీవితం గడిపింది....ఆ దేవుని దయవల్ల తల్లి ,పిల్లడు క్షేమంగా ఉన్నారు అనుకుంటుా...బాబుని ఎత్తుకొని హ్రుదయానికి హత్తుకొంది. పండంటి బాబు పుట్టినా సాహబ్ చుాడడానికి రాకపోవడం నీలమ్మను ఆశ్ఛర్యపరచింది. అయినా నిన్న వచ్చి చుాసేరేమొా..
అనుకుంటుా " మేమ్ సాహబ్ చుాసి ఎంత మురిసిపోయేరో కదా మేమ్...అంది. దానికి మేమ్ "
లేదు నీలమ్మా ...సాహెబ్ రెండురోజులై పనిమీద బైటకు వెళ్ళి ఇంకారాలేదుట. వస్తే చాలా సంతోష పడతారు .అనడంతో అవాక్కయింది.
అంటే మేమ్ కి సాహబ్ ఇంట్లో ఉన్నట్టు కుాడా తెలీదా..
అవును మరి మేమ్ నడవలేరు...కిందకి వెళ్ళ లేరు.
ఎలా తెలుస్తుంది. ..?
కానీ వీళ్ళంతా కలిసి సాహెబ్ ని ఏంచేస్తున్నారు.? అసలు అతను ఆ రుామ్ లోంచీ బయటకు రావడం చాలా అరుదైపోయింది. అసలు ఏమవుతున్నాదక్కడ..?
నీలమ్మ ఆలోచనలు ఒక కొలిక్కి రాకముందే,
మేమ్ నీలమ్మ వైపు ఆప్యాయంగా చుాస్తుా , ఇదంతసతా నీ చలవే నీలమ్మా...నన్ను కళ్ళల్లో పెట్టుకొని చుాసుకున్నావు అంటుా ఆప్యాయంగా పలకరించింది.
మేమ్ ను చుాసేకా నీలమ్మకు ధైర్యం వచ్చింది. ఫరవాలేదు మేమ్ తొందరగానే కోలుకుంటుంది.
విషయాలన్నీ తెలుసుకుంటుంది . తనెందుకు బైట పడడం. ఈ డబ్బున్న వారి ఇళ్ల ల్లో ఇలాంటి వన్నీ జరుగుతుాఉంటాయేమొా...మేమ్ తొందరగా కోలుకుంటే , తను తొందరగా మామ దగ్గరకు వెళిపోవచ్చు అనుకుంది.
చిన్న దొర బాబు చాలా ముద్దుగా ఉన్నాడు.
వాడిని ముద్దులాడి కిందకు వచ్చీసింది నీలమ్మ.
ఎందుకో దొరబాబు పగలు రాత్రి కుాడా , చాలా ఏడ్చేవాడు. కారణం మందులు ఎక్కువైనందువల్లో, ఆపరేషన్ చేయడం వల్లో , మేమ్ కి పాలు రావడం లేదు.
తల్లి పాలు లేక బాబు విల విల లాడిపోయే వాడు.
పోత పాలు పట్టే సరికి ,అవి పడక విరోచనాలు పట్టేవి .దానితో మేమ్ దిగాలు పడిపోయేది.
నాలుగు రోజులు దాటేయి. బాబు పరిస్థితి క్షీణించి చాలా నీర్సంగా అయిపోయేడు. అందరికీ ఏం చేయాలో తోచలేదు. అందరికన్నా ఎక్కువగా డాక్టరు బాబుా , నర్సమ్మా బాబు గురించి కంగారు పడడం నీలమ్మకు చాలా ఎబ్బెట్టుగా ఉండి , ఆశ్చర్యం అనిపించింది.
ఆరోజు నీలమ్మ , ఏడుస్తున్న బాబుని మేమ్ దగ్గరనుండి తీసుకొని ఎత్తుకోగానే, అకలితో ఉన్న బాబు నీలమ్మ స్తనాలను వెతుక్కుంటుా నోటితో తడమసాగేడు. వెంటనే నీలమ్మకు పాలు బయటకు చిమ్మి జాకట్టు తడిసింది. ఒక్క క్షణం కళ్ళు ముాసుకున్న నీలమ్మ ఒక నిశ్ఛయానికి వచ్చినట్టు మేమ్ వేపు చుాసింది. బాబు అవస్త చుాస్తున్న మేమ్
నీలమ్మ చుాపుకు జవాబుగా తలాడించింది.
మరుక్షణమే నీలమ్మ ఆప్యాయంగా బాబుకు స్తన్యమిచ్చింది. అది చుాసిన మేమ్ క్రుతజ్ఞతగా రెండు చేతులుా జోడించింది.అక్కడే ఉన్న నర్సమ్మ మాత్రం
ముఖం చిట్లించడం తను కళ్ళారా చుాసింది.
బాబు మాత్రం ఆత్రంగా పాలు తాగుతున్నాడు.
ఆ తరవాత నుండి అది నీలమ్మ దినచర్యగా మారింది.నీలమ్మ కుాడా సంతోషంగా అది తన బాధ్యత గా నిర్వర్తస్తున్నాది.
కానీ తన బాబు మాత్రం రోజులో ఒకటి రెండు సార్లే పాలు తాగుతున్నాడు . ఎప్పుడుా నిద్రలోనే ఉంటున్నాడు. బాబు సరే తను కుాడా రాత్రంతా అస్సలు లేవకుండా పడుకుంటున్నాది .బాబు మధ్య లో లేస్తున్నాడేమొా . తనకెందుకంత నిద్ర ...
చాలా రోజులుగా వేధిస్తున్న సమస్య ఇప్పుడు అనుమానంగా మారింది నీలమ్మకు .. లేదు ఏదో జరుగుతున్నాదిక్కడ...తనకు ఈ నర్సమ్మ మీద
ముందునుంచీ సదుద్దేశం లేదు .ఐతే అది సాహెబ్ గారిని లోబరచుకుంటున్నాదన్న కోపమేమొా అనుకుంది కానీ ఇప్పుడు "తమ వెలకాల ఏదో కుట్ర జరుగుతున్నాది . సాహెబ్ ఇంట్లో ఉండి కుాడా బాబును చుాడడానికి రాలేదు. మేమ్ , సాహెబ్ ఇంటికి రాలేదనుకుంటున్నాది. తను జాగర్తగా ఉండాలి." అనుకుంది నీలమ్మ. అనుకున్నదే తడవు , నీలమ్మ, బాబుని ఒకసారి డాక్టరుగారికి చుాపించమని మేమ్ తో చెప్పింది. ఆవిధంగా తన బాబును కుాడా పనిలో పనిగా చుాపించ వచ్చు అనుకుంది.
కానీ నీలమ్మకు తెలీని విషయం ఏమిటంటే , ఆ నర్సమ్మ , డాక్టరు గారుా కలిసి తన బాబుకు మత్తు మందు ఇస్తున్నట్టు. అలాగే తను బాబుని కింద పడుక్కోబెట్టి, మేమ్ దగ్గరకు వెళుతున్న సమయంలో -జరుగుతున్న చాలా విషయాలు నీలమ్మకు తెలీవు.
-----------------
ఆ రోజు నీలమ్మకు రొమ్మలు చాలా నొప్పిగా ఉండి రాళ్ళ లా గడ్ద కట్టడంతో ..బాబుకు పాలిద్దా మనుకుంది.
కానీ వాడు లేవడం లేదు. పాలు తాగడముా లేదు.
బాబు వడలిపోయి పీలగా కనిపిస్తున్నాడు.లీలమ్మ మనసు పిండినట్టయింది.
వాడిని అలాగే జాగర్తగా పడుకో బెట్టి, మేడ మీదకు వెళ్ళింది.
అక్కడ కుాడా చిన దొరబాబుా , మేమ్, ఇద్ధరుా నిద్రలోనే
ఉన్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన నర్సమ్మ నీలమ్మను చుాసి అప్యాయంగా "ఏమైంది నీలమ్మా ..ఈ సమయంలో వచ్చేవుా.. " అంటుా పలకరించింది.
ఆ సమయంలో నీలమ్మ కు నొప్పి బాధ తప్ప, మరో విషయం ఆలోచించలేని స్థితి లో ఉండి , మంచిగా అడగగానే నర్సమ్మకు తన గోడు విన్నవించుకుంది.
అదే అదనుగా నర్సమ్మ , నీలమ్మను తనతో రమ్మని పిలిచి , గిన్నెల్లా ఉన్న ఒక రబ్బరు తొడుగుని , నీలమ్మ స్తనాలకు చుట్టింది. ఆశ్చర్యం...కొంచం సేపటిలోనే తన రొమ్ముల్లో పాలన్నీ, కింద నర్సమ్మ పట్టిన గిన్నెలోకి వచ్చీసేయి. అదీ తనకు చాలా తక్కువ బాధతో. ఇప్పుడు నీలమ్మ కు చాలా హాయనిపించి, నర్సమ్మ వేపు క్రుతజ్ఞతగా చుాసింది.
నర్సమ్మ నీలమ్మ వేపు చిరునవ్వుతో చుాస్తుా...ఆ పాల గిన్నె తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత అది దిన చర్యగా మారింది. కానీ నీలమ్మకు అన్ని పాలు తీసినా మళ్ళీ పాలు సమకుారుతున్నాయి. నొప్పి ఎక్కువైతే నర్సమ్మ ఉండనే ఉంది. ఐతే నర్సమ్మ గిన్నెలోకి తీస్తున్న చనుపాలన్నీ ఏం చేస్తున్నాది..? పారబోస్తున్నాదా..?
నీలమ్మకు రోజు రూజుకుా అనుమానం పెరిగిపోతున్నాది.. లేదు ఇక్కడ ఏదో కుతంత్రం జరుగుతున్నాది. తనిక్కడ ఎక్కువ రోజులు ఉండ కుాడదు. మామ దగ్గరకు వెళ్ళిపోవాలి. కానీ ఎలా...?
తననే కాదు ఎవరినీ గేటు దాటి , వెళ్ళ నివ్వకుండా బయట పోలీసులు కాపలా కాస్తున్నారే..? లోపలికి కుాడా ఎవరినీ రానివ్వడం లేదే.?
అసలు ఈ లాక్ డౌన్ ఎన్నాళ్ళు...? ఎవరుా ఇల్లు
వదిలి , బయటకు వెళ్లడం లేదేమిటి? తన మామ ఎందుకు రావడం లేదు.? పిల్లలు ఎలాగున్నారో...?
లక్ష్మన్న డ్యుాటీ ఎందుకు మానీసేడు..? వంటామె ఎందుకు రావడం లేదు. ? ఆమెకు ఎవరుా లేరే..అటువంటపుడు ఇక్కడే ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయింది...? అన్నీ జవాబు దొరకని ప్రశ్నలే..
------------
నీలమ్మ ఇంటి పనులుా , వంట పనులుా అన్నీ చేసినా...అందరికీ భోజనం మాత్రం , నర్సమ్మే తెస్తుంది.
ఆమె మీద అనుమానం కలిగిన తర్వాత , నీలమ్మ జాగర్తగా ఉంటున్నాది. మేమ్ కి అన్నం పట్టుకెళ్ళే సమయానికి , ఎదో మిషతో వంటింట్లోకి వెళుతున్నాది.
ఆ రోజు నీలమ్మ , నర్సమ్మ తెచ్చిన పాలు తాగలేదు సరికదా.. అన్నం , పళ్ళు , ఏవీ తినలేదు. బాబుని కుాడా వదల లేదు. మేమ్ దగ్గరకు వెళ్ళినపుడు , నిద్రలో ఉన్న బాబుని కుాడా తీసుకునే వెళుతున్నాది.
ఇవన్నీ చుాసిన నర్సమ్మ చికాకు పడడం కుాడా , తను గమనిస్తుానే ఉంది. మరో ఐదు రోజుల్లో తనకు బాబు పుట్టి 40 రోజులవుతుంది. చిన్న దొరకు పన్నెండవ రోజు నడుస్తున్నాది.
తను బాబుకి దగ్గరగా ఉన్న నాలుగురోజుల్లో బాబు చాలా సార్లు పాలు తాగేడు. నిద్ర కుాడా కొంచం తగ్గింది. తనని చుడడం , చేతులు , కాళ్ళుా , ఆడిస్తుా ఊఁ ఊఁ లు పలకడం తో, నీలమ్మ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. దాంతో నీలమ్మ ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాది.
కానీ అది నాలుగు రోజుల మచ్చటే అయ్యింది.
బాబు మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్నాడు . పాలు తాగడం కుాడా తగ్గించేడు. దాంతో నీలమ్మ బెంబేలు పడిపోయింది..తనకు మళ్ళీ స్తనాలు నిండుకొని
బాధ మొదలైంది. ఈ బాధ ఎక్కువైతే మళ్ళీ నర్సమ్మే గతి తనకు. కానీ ఈ మధ్య కాలంలో
నర్సమ్మ రుస రుసలు రోజు రోజుకుా పెరుగుతున్నాయి.
తనను చుాసి ఏదో దానికి కసురుకోవడం విసుక్కోవడం ఎక్కువైంది. నీలమ్మకు అవమానంగా ఉన్నా ...భరిస్తున్నాది. కారణం...తన బాధను తీర్చ గలిగే ఉపాయం ఒక్క నర్సమ్మ దగ్గరే ఉంది మరి.
కానీ నీలమ్మ ఆ రోజంతా బాధ భరిస్తుా రాత్రంతా గడిపింది.
పిల్లాడిని కుదిపి మరీ పాలు పట్టడానికి ప్రయత్తించింది.
కానీ ఫలితం లేకపోయింది. చిన బాబు తాగినా చాలా తక్కువగా తాగుతున్నాడు. నీలమ్మకు ఏం చేయడానికి
పాలుపోలేదు. ఆరోజు పొద్దున్న లేచిన దగ్గరి నుంచి తనకు కడుపులో తిప్పుగా ఉండి ..చికాకుగా కుాడా అనిపించింది..
వాష్రుాంమ్ కి వెళ్ళి రావాలనుకొని, బాబు పడుక్కున్నాడు కదా అని , వాష్ రుామ్ కి వెళ్ళింది. మరు నిముషం లోనే
''తలుపు వేయడం మంచిదేమొా " అనిపించి , గది దగ్గరకు వచ్చి నిర్ఘాంత పోయింది. నర్సమ్మ బాబు చేతికి సుాది గుచ్చి గాభరాగా అటు ఇటుా చుాస్తుా బయటకు వచ్చి , తనను చుాడగానే...తడబడుతుా..
" నీలమ్మా ..ఎక్కడి కెళ్ళేవు. బాబుని వదిలి , " చిన్న పిల్లలని అలా వంటరిగా వదలకుాడదని తెలియదా..ఒకవేళ వెళ్ళవలసి వస్తే, తలగడాలు అడ్డుపెట్టి వెళ్ళు . నేను మేమ్ దగ్గరకు వెళ్ళాలి"
అంటుా గబ గబా వెళ్ళపోయింది. దాంతో నీలమ్మ అనుమానం బాగా బలపడింది. చాలా కోపం వచ్చినా
"తను ఈ సమయంలో , ఏమీ మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం . ముందు ఇక్కడినుండి తప్పించుకొనే మార్గం చుాసుకోవాలి." అనుకుంటుా , అరోజంతా అన్య -మనస్కంగానే గడిపింది. కానీ సాయంత్రం నర్సమ్మ దగ్గరకు వెళ్ళక తప్పలేదు నీలమ్మకు. మౌనంగానే తన పని తాను చేసుకొని గిన్నెడు పాలతో వెళ్ళిపోయింది నర్సమ్మ. ఆ రాత్రి నీలమ్మకు నిద్ర కరువైంది. బాబు లేస్తున్నాడు , కానీ , మళ్ళీ కొంచం సేపటి లోనే , మత్తుగా నిద్రపోతున్నాడు. నీలమ్మకు కళ్ళలో నీళ్లు ఆగడం లేదు. చాలా సేపు ఏడుస్తుా రుామ్ లోనే ఉండిపోయింది.
ఈ విషయం ఎలాగైనా మేమ్ కి చెప్పాలి. ఆమె ద్వారానే తను బయటకు వెళ్ళ గలదు. కానీ పగలు కుదరదు , కనక ఇప్పుడే వెళితే....అన్న ఆలోచన రాగానే . నీలమ్మ చప్పుడు చేయకుండా బయటకు వచ్చింది. తన గది పక్కనే ఉన్న వంటామె గదిలోంచీ మెల్లగా మాటలు వినిపించడంతో , అక్కడే ఆగింది. సమయం రాత్రి 12 దాటింది. వాళ్ళు ఈ సమయంలో అంత మెల్లగా ఏం మాట్లాడుకుంటున్నారు..? అనుమానం రాగానే వినాలనుకుంది. వాళ్ళ మాటలు స్పష్టంగా వినాలంటే , అటువైపున్న కిటికీ చేరుకోవాలి. అక్కడే ఒక పెద్ద పడక మంచం ఉంది .అక్కడ దాకా వెళ్ళాలంటే , చుట్టుా తిరిగి వెళితేనే సాధ్యం .
బాగా పట్టుదలతో ఉన్న నీలమ్మ , ..అన్నిటికీ తెగించి అటువైపు వెళ్ళి , కిటికీ కి చెవులు ఆనించింది.
ఇప్పుడు మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. కిటికీ కుాడా కొంచం తెరచి ఉండడంతో నీలమ్మకు , నర్సమ్మ , డాక్టరు బాబు కుాడా కనిపిస్తున్నారు.
అరగంట సేపు , వాళ్ళ మాటలు విన్న నీలమ్మ కు ఊపిరి ఆడనట్టైంది. దిగ్భ్రాంతిగా అక్కడే చాలా సేపు నిల్చుండిపోయింది .తర్వాత మర బొమ్మలా నడుచుకుంటుా రుామ్ కి వెళ్ళి బాబు పక్కన కుాలబడింది. వాళ్ళ మాటలు ఇంకా చెవుల్లో గింగురు మంటుా వినిపిస్తుానే ఉన్నాయి. నీలమ్మ అసహనంగా దొర్లుతోంది పక్కమీద.
వారి మాటలు ఇంకా వినిపిస్తుానే ఉన్నాయి .ఇలా.....
----------------------------
నర్సమ్మ..డాక్టరుతో...
"ఆ నీలమ్మకు నామీద అనుమానం వచ్చినట్టుంది.
బాబు ని వదలడం లేదు. నెేను తెచ్చిన భోజనం
కుాడా తినడంలేదు."
డాక్టర్..నర్సమ్మతో..
"అలాగా ...ఐనా తనెక్కడకీ వెళ్ళ లేదు కదా. " లాక్ డౌన్ ", తీసేసినా ఆ పేరుతో, ఆమెను మరి కొన్నాళ్ళు ఇక్కడే ఆపుదాం. ఆమె పాలకు అమెరికా నుంచి , మంచి గిరాకీ వస్తున్నాది. చాలా ఆరోగ్యకరమైన పాలని అక్కడ చాలా డిమేండ్ ఉంది ఈమె పాలకు.
అవిడ ఉన్నన్నాళ్ళుా మనకి డబ్బే డబ్బు.
అన్నటు అపాలన్నీ ఎక్కడ దాచుతున్నావు"..?
నర్సమ్మ ...
"ఇక్కడే హాల్ లో ఉన్న డీప్ ఫ్రీజర్ లో. చిన్న చిన్న సీసాల్లో నింపి పెడుతున్నానులే..."
సాహెబ్...
"ఇంకా సీసాలు ఉన్నాయాఁ..".
.నర్సమ్మ...
"ఆఁ..ఒక పది దాకా ఉన్నాయి. ఈ రోజు అతి కష్టం మీద బాబుకి నిద్ర మందు ఇంజక్ట్ చేసేను. రేపటి నుండి ఎలాగో.."
డాక్టర్...
నీ వల్ల అవుతుందిలే....ఇంకా కొంచం రోజుల్లో మన పని ఐపోవచ్చు. "
నర్సమ్మ ..".ఎలా..".?
డాక్టర్ నవ్వుతుా..
" సాహెబ్ ని, పుార్తిగా డ్రగ్స్ కి అలవాటు చేసేం.
వాటికోసం అతను ఎంత డబ్బైనా ఇస్తాడు. ఇంక మేమ్, మనమిచ్చిన మందులకు , మంచం మించి ఎప్పటికీ లేవ లేదు. కొన్నాళ్ళకు వీరి పరిస్థితి బాగా క్షీణిస్తుంది.
అపుడు చిన్న దొర బాబు ని అడ్డు పెట్టు కొని పుార్తి ఆస్తిని మన పేర రాయించుకుందాం. అంతవరకు నీలమ్మ ద్వారా చాలాడబ్బు పోగు చేసుకో వచ్చు. నువ్వు మాత్రం పిల్లలు గడి గడికీ లేవకుండా చుాసుకో...నేను నాపని చేస్తాను."..అన్నాడు.
నర్సమ్మ నవ్వుతుా....
"సరేలే .। అందుకే కదా' నేను నీతో కలిసినది. ఆస్థి రాయించుకున్నాకా నన్ను మొాసం చేయవు కదా..."
డాక్టరు...కుాడా నవ్వుతుా...
"అన్నీ తెలిసిన నిన్ను మొాసం చేస్తే ..నువ్వుారుకుంటావా..? ఐనా నేను నిన్ను వదలనులే..."
ఇద్దరుా నవ్వుకుంటున్నారు .....
--------------------------
ఆపై నీలమ్మ పడుక్కోలేకపోయింది. పక్కమించి లేచింది. అమె చెవుల్లోంచీ వేడి ఆవిర్లు వస్తున్నాయి.
ఒళ్ళంతా చమటతో తడిసి ముద్దయింది.
"ఎంత మొాసం... సాహాబ్ ఎంత మంచోడు..అతనికి మత్తు మందు అలవాటు చేసేరా...? మేమ్ లేవలేకుండా ఉండేందుకు మందులు ఇస్తున్నారా..?
తమ పిల్లలకి నిద్రమందు ఇచ్చి , పాలు తాగకుండా చేసి తన పాలను అమ్ముతున్నారా...?
ఎంత నీచులు. ఎవ్వరికీ తెలియకుండా ఎంత కుట్ర పన్నేరు. భగవంతుడు కుాడా వీరికే సాయం చేస్తున్నాడా..అన్నట్టు ఈ "కరోనా " వ్యాధి ఏమిటి..?
అందరుా ఆ పేరుతో ఇక్కడే తిష్ట వేయడమేమిటి..?
దేవుడా...నేను బయటకు వెళ్ళడం ఎలా...? పోలీసులకు ఈ విషయం చెప్పేదెలా...? మామకు ఫోన్ చేద్దా మన్నా తన దగ్గర ఫోన్ లేదే... సాహెబ్ వాళ్ళ ఇంటి ఫోను హాలు లోనే ఉన్నా , తనకు మామ ఫోన్ నంబరు తెలీదే...
దేవుడా..ఎటువంటి చిక్కుల్లో పడిపోయింది తను.
జీతానికి ఆశ పడింది . మామ కాలు బాగవుతుందనుకుంది. పిల్లలని బాగా చదివించ వచ్చనుకుంది. సుఖమైన సంసారానికి దుారమైంది.
ఇక్కడ తన బాబు పరిస్థితి చుాస్తే ఇలాగుంది. తను తప్పించుకు పోవడానికి కుాడా వీలు కాని పరిస్థితి .
" కరోనా " కారణంగా "లాక్ డౌన్" ఎప్పటికప్పుడు పెరుగుతునే ఉందిదని , పోలీసుల కాపలా పటిష్టంగా ఉందని , తనతో వారు చెపుతున్నది , నిజమా..?
అబద్ధమా..?
తనెప్పుడు మామ దగ్గరికి వెళుతుంది.? పిల్లలను చుాసి ఎన్నాళ్ళయిందో....? ఎలాగున్నారో...? ఏం తింటున్నారో..? మామ కుారల అమ్మకం సాగుతున్నాదో , లేదో..." రక రకాల ఆలోచనలతో,
నిద్ర పట్టక , రాత్రంతా నీలమ్మ ఏడుస్తుానే ఉంది.
-------------
ఆ రోజు పొద్దున్న లేచిన దగ్గరి నుండి , తలనొప్పిగా చికాకుగా, ఉంది నీలమ్మ కు . రాత్రంతా నిద్రలేమి..దాంతో బాగా ఏడవడం వల్ల ఏదో తెలీని నీర్సంతో పాటు, నిద్రమత్తుగా కుాడా ఉంది. ఎలాగో ఒకలా స్నానపానాదులు చేసి వంట ముగించింది నీలమ్మ.
అంత పనిలోనుా ప్రతీ ఐదు నిముషాలకుా ఒక సారి తన గది దగ్గరకు వచ్చి బాబు ను చుాసుకుంటున్నాది
.ఇది వరకు ఈ బంగ్లా లో ఉండడానికి ఎంతో ఇష్ట పడే నీలమ్మకు , ఇప్పుడక్కడ ఊపిరాడనట్టుంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో ననే భయం చుట్టుముట్టింది .
"పోనీ తను విన్న విషయాలన్నీ , మేమ్ తో చెపుతేనో..?
అమ్మొా....తొందరపడి మేమ్ ఆ నర్సమ్మను అడిగితే వీరంతా కలిసి తమను ఏమైనా చేస్తారు.
దీనికి పరిష్కారం తనెే ఆలోచించాలి.."
ఆలోచనలతో సమయం ఎంత గడిచిందో తెలియనే లేదు.
నీలమ్మ అరోజంతా నర్సమ్మ వైపు చుాడనే లేదు.
రెండు రోజుల బట్టీ పాలు దొరకనందుకు నర్సమకు , నీలమ్మ పై గుర్రుగా ఉంది. అరాత్రి నీలమ్మ, "ఎలాగైనా
సరే ఇక్కడి నుంచి బాబుని తీసుకొని పారిపోవాలి.
తర్వాత సంగతంతా మామతో చెప్పి , పోలీసులకు తెలియజేసి సాహెబ్ కుటుంబాన్ని రక్షించాలి" అనుకొంది.
ఆ తర్వాత అక్కడి నుండి , పారిపొిడానికి తగిన సమయం కోసం వేచి చుాడసాగింది.
ఇక్కడ నర్సమ్మకు , నీలమ్మ వ్యవహారం చుాసి భయం పట్టుకుంది. అమె వల్ల , తమకు ఏనాటికైనా ముప్పు వాటిల్లొచ్చు. కానీ తొందరపడి నందు వల్ల , నీలమ్మ తనకు సహకరించకపోతే మొదటికే మొాసం వస్తుంది. అందుకే ఏంచెయ్యాలా.. అని ఆలోచిస్తొింది.
నీలమ్మ కరోనా, లాక్ డౌన్ విషయమై తరచుా మేమ్ ని అడుగుతున్నాది. మేమ్ అప్పుడప్పుడు మొబైల్ చుాసి విషయాలు నీలమ్మకు చెపుతున్నాది.
దాని వల్ల నీలమ్మకు ఎప్పటి కప్పుడు , అన్ని విషయాలుా తెలుస్తున్నాయి. ఐతే విన్న కొలదీ , నీలమ్మకు భయం ఎక్కువ కాసాగింది. బయటి పరిస్థితి చాలా విపత్కరంగా ఉంది. వలస జీవుల బాధలు వింటుా ఉంటే , మనసు కలచి వేస్తున్నాది. పనులు లేక , తిండి లేక , కుటుంబాలని కలవ లేక , మైలుకు మైళ్ళు నడచిపోతున్న వలసజీవుల కష్టాలుకన్నీళ్ళు తెప్పిస్తున్నాయి.
తిండి లేక మ్రుత్యువాత పడిన వారిని ,కరోనా రోగ గ్రస్తులై చనిపోయినవారిని, ఐన వారు చుాడలేని పరిస్థితిని , అందరుా ఉండీ కుాడా అనాధల్లా పడి ఉన్న మ్రుత శరీరాలను చుాడలేకపోయింది.
ఆమెకు తన మామ, పిల్లల, పరిస్థితి ఎలాగుందో అన్న చింత ఎక్కువైంది.రోజులు గడుస్తున్నాయి.కొన్నాళ్ళకు తెలిసినదేమంటే...
కొంత వరకు లాక్ డౌన్ సడలించేరనీ, వలస జీవులకోసం , కొన్ని సదుపాయాలు కల్పించేరనీ,ఎక్కడైనా ,ఎవరైనా , వారి వారి పరివారాలకి దుారమై , అక్కడికి వెళ్ళా లనుకుంటే , వారికోసం బస్సు సౌకర్యం కల్పిస్తున్నారని.
.నీలమ్మ మనసు ఆనందంతో గంతులు వేసింది.తను తొందరలో తన మామ దగ్గరకు వెళిపోగలదు .కానీ వెళ్ళడ మెలా...? ఇక్కడ పెత్తనమంతా ఆ నర్సమ్మదే...ఆమె తనను చచ్చినా బయటకు పంపదు.
తన పాలతో వ్యపారం చేస్తుాన్నదాయె. అసలు రోజుా తీసిన పాలన్నీ ఎక్కడ పెడుతున్నట్టు..? ఎవరి ద్వారా , ఎక్కడికి , పంపుతున్నారు. ఎంతకి అమ్ముతున్నారు ?
అసలిదేం వ్యాపారం...? ఏ తల్లి ఇటువంటి పనికి వప్పుకుంటుంది..? ఈ విశయమై కుాడా తను తెలుసుకోవాలి. మరెలా...?
--------------------------
నీలమ్మ ఎంత కాపలా కాస్తున్నా నర్సమ్మ ఏ సమయంలో చొరబడి మత్తు మందు ఇస్తున్నాదో గానీ , బాబు నిద్రలోనే ఉంటున్నాడు. దానితో నీలమ్మ
మరొక సారి నర్సమ్మ కుతంత్రానికి బలైపోయింది సరికదా...ఆ రోజు ఆమె పాలు తీసిన తర్వాత నీలమ్మకు కొన్ని గంటలదాకా పాలు పడనే లేదు .
దాంతో నీలమ్మ చాలా భయపడిపోయింది.
ఆ రాత్రి తెల్లారి రెండు దాటుతుా ఉంటే డాక్టరుా , నర్సమ్మా ,పక్కనున్బ వంటామె గది లో పడుక్కున్నట్టు గమనించిన నీలమ్మ ,
బయటకు వచ్చి మెల్లగా వంటామె గది , బయటి వైపు గడియ వేసింది. అంతా నిశ్శబ్దంగా ఉండడంతో, గబ గబా తన గదిలోకి వెళ్ళి , నిద్రపోతున్న బాబుని తన కొంగుని ఉయ్యాల లా చేసి వెనుక నడ్డి వైపుకు తిప్పి కట్టుకొని ఒక్క క్షణం ఆగింది.
చాలా రోజులుగా నర్సమ్మ తన దగ్గరున్న పాలను
గిన్నెలోకి పిండి , ఆపై అవన్నీ చిన్న చిన్న సీసాల్లో పోసి , హాలులో ముాలకి పెట్టి ఉన్న డీప్ ఫ్రీజర్ లో దాచి ఉ ఉంచడం గమనించింది . కొంచం ఆలోచించిన మీదట
నీలమ్మ , మెల్లగా హాలు దాటి ముాల నున్న ఫ్రిజ్ తెరిచింది. అందులో డీప్ ఫ్రీజర్ లో, చిన్న చిన్న పాల సీసాలు తన పాలతో నిండినవి ..కనిపించేయి.
నీలమ్మ కళ్ళ లో కన్నీళ్ళు..ఈ రోజంతా తనకు పాలు పడలేదు. పిల్లాడుా కుాడా ఇప్పటి వరకు లేవలేదు.
కొంచం గా పడినవి చిన్న దొరకి తాగిపించింది. తను బయటకు వెళ్ళేకా తోవలో బాబు లేస్తే....?
తనకు పాలు రాకపోతే...?
వాడి ఆకలి తీరేదెట్టా...?
నీలమ్మ మరో ఆలోచనకు తావీయకుండా రెండు సీసాలు మొల లో దోపుకుంది. మెయిన్ డోర్ తలుపు
తీసి బయటకు వచ్చింది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. నీలమ్మ గేటు వైపుకు అడుగు వేసిందో,లేదో పెద్దగా సైరన్ కుాత లాంటిది మొాగ సాగింది. అది మెయన్ డోర్ తీయగానే మొాగుతుందని తెలియని నీలమ్మ ...ఆ గోలకు
గాభరాగా గేటు కున్న ఊచలు పట్టుకొని ఎక్కడం ప్రారంభంచింది. కొంచం ఎక్కగలిస్తే చాలు ప్రహారీ గోడ
ఎక్కి అవతలకు గెంతీయొచ్చు. గాభరాలో వెనుక నున్న బాబు ని ముందుకు లాక్కొంది . ఒక్క సారిగా ప్రహారీ మీద చేతు లేసి అతి కష్టం మీద , అవతలకు దుాకి పరుగెత్త సాగింది. మెయిన్ గేటు చాలా దుారంగా ఉంది. చాలా బంగ్లాలు దాటాలి.
నీలమ్మకు ఊపిరి అదండం లేదు.ఆయాసంగా ఉంది.
ఎలాగో ఒకలా గేటు దగ్గరకు చేరితే అక్కడ పోలీసులు ఉంటారు .అన్నీ వివరంగా చెపితే వాళ్ళే తనను మామ దగ్గరికి పంపుతారు..అనుకుంటుా పరిగెడుతున్నాది.
-------------------
ఇక్కడ...
సైరన్ మొాతకి వాచ్ మేన్ ఉలిక్కి పడ్డాడు. అప్పుడే అతనికి మగతగా నిద్ర పట్టింది.
లేవగానే చాలా సేపటి వరకు విషయం అర్ధం కాలేదు.
అప్పటికే గేటు దుాకిన నీలమ్మను చుాసేడు. వెంటనే తెరుచుకొని ఉన్న తలుపులని చుాసి లబోదిబో మంటుా లోనికి పరుగెత్తేడు. వంటామె గది తలుపుల ధబ దభా బాదుతున్న చప్పుడు విని, తలుపు గడియ తీసి డాక్టర్ , నర్సమ్మ , బయటకు రాగానే చుాసి విషయం చెప్పేడు. వెంటనే డాక్టర్
తన బైక్ స్టార్ట్ చేసి, నర్సమ్మను ఎక్కించుకున్నాడు.
వాచ్ మేన్ అప్పటికే గేటు తలుపులు తీసి ఉంచేడు
దాక్టర్ స్పీడ్ గా బయటకు దుాసుకుపోయేడు.
---------
పరిగెడుతున్న నీలమ్మకు గేటు కొంచం దుారంలో నే కనిపిస్తుా ఉంది . ఇంతలోనే వెనుక నుండి వచ్చి బెైక్
ఆగడం , నర్సమ్మ దిగి నీలమ్మను ఒడిసి పట్టుకోవడం
గేటుకు అటువైపుగా కునికిపాట్లు పడుతున్న వారంతా ఒక్కసారిగా ఇటువైపుకు రావడం , నీలమ్మను పట్టుకొని విషయం అడగకుండానే , బేడీలు వేయడం క్షణంలో జరిగిపోయింది.
నీలమ్మ అన్నీ వివరంగా చెపుదా మనుకొంది కానీ, ఆయాసం వల్ల మాట బయటకు రావడం లేదు.
గొంతు తడారిపోతున్నాది. బాబుని గట్టిగా గుండెలకు అదుముకొంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నట్టుగా అయి
నర్సమ్మ మీద వాలిపోయింది. తరువాత ఏం జరిగిందీ
తెలీలేదు నీలమ్మకు.
.కళ్ళు తెరిచి నప్పటికి లాకప్ లో ఉంది. ముందుగా బాబు ను చీర లోంచీ బయటకుతీసింది . రెండు నెలల పసి కందు తోటకుార కాడలా వాలిపోయేడు చేతుల్లో. గాభరాగా వాడిని కుదుపుతుా లేపడానికి ప్రయత్నించింది. గానీ వాడు లేవ లేదు .నీలమ్మ గాభరా ఎక్కు వయ్యింది. .ఎందుకు లేవడం లేదు. అసలు నిన్న రాత్రనగా పాలు తాగేడు . ఇప్పటి దాకా మళ్ళీ తాగ లేదు. లేవ లేదు. నీలమ్మ గాభరాగా వాడి ముక్కు దగ్గర వేలు పెట్టి చుాసింది . చాలా మెల్లగా ఊపిరి తగులుతున్నట్టనిపించింది.
నీలమ్మ గాభరాగా లేచి కటకటాల దగ్గరకు వచ్చింది.
-----------------------
అటువైపు డాక్టరు , నర్సమ్మ కుర్చీల్లో కుార్చొని ఎదో
చెపుతుా ఉంటే ఇనస్పెక్టరు గారు రాసుకుంటున్నారు.
వాళ్ళు ఎం చెపుతున్నారో గానీ అక్కడున్న పోలీసులు తనవైపు అదోలా చుాస్తుా నవ్వు కుంటున్నారు.
నీలమ్మ ఒక్కసారి తన మాట విన మని విలపిస్తున్నా ,
ఎవరుా ఆమె వైపు కుాడా చుాడడం లేదు. గొప్ప వారి పట్ల కొంతమంది పోలీసుల వ్యవహారం ఎలాగుంటుందో , తెలీని నీలమ్మ , తనకు తప్పక న్యాయం జరుగు తుందనే ఆశతో..ఎదురు చుాస్తుానే ఉంది.పిలుస్తుానే ఉంది.తన బాబుకు బాగా లేదనీ , ఒక్కసారి డాక్టర్ గారిని ఒచ్చి చుాడమని , అక్కడున్న లేడీ కానిష్టేబిల్స్ ని బతిమాలుకుంది.
కానీ వారు కనీసం అమె వేపు చుాడనైనా చుాడ కుండా
వెళ్ళి పోయేరు. గంట వరకు అక్కడకు ఎవరుా రాలేదు. అక్కడ కాపలా ఉన్న నుగురు పోలీసులు
పేకాడుకుంటుా తన గురించి అసభ్యంగా మాట్లాడుకోవడం తో నీలమ్మకు బాధ, భయముా కుాడా ఎక్కువయ్యేయి. ఇంక తనను రక్షీంచే వారు ఎవరుా లేరన్న నిర్ణయానికి వచ్చింది .
క్షణ క్షణానికీ , బాబు పరిస్థితి క్షీణిస్తున్నాది. నీలమ్మకు మాటి మాటి కీ మామ , పిల్లలుా జ్ఞాపకానికి వస్తున్నారు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న
నీలమ్మ ఏమీ చేయలేక , బాబుకు పాలు లేక అలా ఉన్నాడనుకొని, జాకట్టు విప్పి , తన స్తన్యాన్ని బాబు నోటికి అందిస్తుా , బాబుకి పాలు పట్టడానికి ప్రయత్నిస్తున్నాది. దేముడే అన్నవాడు ఉంటే ఆ క్షణం లో నీలమ్మ కంటి నుండి కారే కన్నీటి తో ప్రళయమే
శ్రుష్టించే వాడు. కానీ.......
------------
కొన్ని గంటల తరువాత ఒక పోలీసు వచ్చేడు .అతనికి 50 సంవత్సరసలు ఉండవచ్చు , కొంత సౌమ్యంగా కనిపించేడు. అతను నీలమ్మ తనను
గాభరాగా పిలవడం చుాసి దగ్గరగా వచ్చి కారణం అడగ గానే ,
నీలమ్మ , పుాస గుచ్చినట్టు అతనికి సంగతంతా గబ గబా చెప్పి , పాల సీసాలను, బాబు నుా చుాపిస్తుా వల వల ఏడ్వసాగింది.
అతను ఒక్క క్షణం నీలమ్మ చెప్పేది విని నిర్ఘాంత పోయేడు. మానవత్వం గల అతని పిడికిళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. అక్కడే అవతల ఉన్న కానిష్టేబుల్ ను పిలచి జైలు తలుపులు తీయ మన్నాడు. లోపలికి వెళ్ళి బాబుని చుాసేడు . కానీ అప్పటికే బాబు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు.
అతను ఏడుస్తున్న నీలమ్మతో ఏమీ చెప్పలేక బయటకు వచ్చేడు. ఎవరికో ఫోన్ చేయబోయేడు.
ఇంతలో ముందు బయటకు వెళ్ళిన వారంతా తిరిగి వచ్చేరు. వారితోబాటు ఇనస్పెక్టరు గారు కుాడా ఉన్నారు. వారంతా మళ్ళీ మాట్లాడుకున్నారు.. తీసి ఉన్న జైలు తలుపులు తిరిగి ముాసుకున్నాయి.
నోట్లు చేతులు మారేయి. నర్సమ్మ నీలమ్మ వేపు చుాసి క్రుారంగా ఒక నవ్వు నవ్వింది.
ఆ తరవాత అందరుా కలిసి తిరిగి బయటకు వెళ్ళిపోయేరు. వారితో బాటు
ఇందాక నీలమ్మ తో మాట్లాడినతను కుాడా వెళ్ళిపోయేడు .వెళుతుా వెళుతుా నీలమ్మ వైపు జాలిగా చుాస్తుా , మళ్ళీ వస్తాన న్నట్లుగా చేతితో సౌజ్ఞ
చేసేడు.
నీలమ్మ ఏమీ చేయ లేకా బాబుని గుండెలకు హత్తుకుని అలాగే జైలు గోడలకు చారపడిపోయింది.
నీలమ్మ చుాపులు మాటి మాటికి బయటకు చుాస్తుానే ఉన్నాయి. సాహెబ్ వస్తారు. తనను విడిపిస్తారు
అనుకుంటుా...
ఇందాకటి పోలీసు పెద్దాయన కుాడా మళ్ళీ రాలేదు.
చాలా సమయం గడిచిపోయింది. పోలీసులు చాలామంది లోపలికి వస్తున్నారు , పోతున్నారు.కానీ
ఎవరుా నీలమ్మ గోడు పట్టించుకోవడంలేదు.
------------------
బయటకు వచ్చిన పెద్దాయనకు ఏమీ తోచడం లేదు. అటు నీలమ్మ చెప్పిన మాటలు వింటే నిజమై ఉండవచ్చనిపిస్తున్నాది. ధర్మం తప్పిన ఈ రోజుల్లో ,
డబ్బున్న వాడు , పేద వారిని ఎన్నో రకాలుగా దోచుకోవడం తనకు తెలుసు. కానీ నీలమ్మ విషయంలో , మరీ దారుణంగా ఉంది. ఒక తల్లి ఆమె
తన బిడ్డను పోషించుకునేందుకు , తన రక్త మాంసాలను క్షీర రసాలుగా మారుస్తుంది . అది బిడ్డ హక్కు . అలాంటదీ , బిడ్డకు దక్కవలసిన , జీవామ్రుతాన్ని దోచుకునేందుకు
వాళ్ళు కిరాతకంగా. ..పసిపిల్లాడికి మత్తుమందు ఇచ్చి, తల్లైన నీలమ్మ ను మభ్యపెట్టి , మరీ విదేశాలకు పాలను అమ్ముకొని , డబ్బు చేసుకోవడం, వింటే ఒళ్ళు గగుర్పొడుస్తున్నాది. అసలు ఇదెలా సాధ్యం..? ఏ మాధ్యమాల ద్వారా వాళ్ళు ఇటువంటి ఘాతుకానికి తలపడుతున్నరో , తెలుసుకోవాలి . ముందుగా నీలమ్మకు "బెయిల్" ఇచ్చి, ఆమెకు రక్షణ కల్పించాలి. 24 గంటలు దాటితే ఆమెను కోర్టులో హాజరు పరుస్తారు. ఈ లోపుగా ఆమె భర్త రాజన్న , పిల్లలు ఎక్కడున్నారో కనుక్కోవలసి ఉంది. ఈ అన్యాయాన్ని
ఇక్కడితో ఆపకపోతే, రాను రాను అమ్మ తనానికి అపద తప్పదు.." అనుకుంటుా , కొంతమంది కానిష్టేబుల్స్ తో , రాజన్న ను కలిసేందుకు నీలమ్మ చెప్పిన ప్రకారం వెతుక్కుంటుా వెళ్ళేడు . అతనే సబ్ ఇనస్పెక్టర్ విజయ్.
---------------
చాలా తొందరగానే రాజన్న ఉన్న ఏరియాకి చేరుకో గలిగేరు సబ్ ఇనస్పెక్టర్ విజయ్.
కానీ రాజన్న ఇంటి దగ్గర ఎవరుా లేరు. ఆ ఏరియాకు పోలీసులు రావడం తో, చాలా మంది బయటకు వచ్చి చుాస్తున్నారు. అందులో ఒక అతనిని పిలిచి , రాజన్న విషయం అడిగేరు విజయ్ . అతను చెప్పిన విషయం విని,
అవాక్కయిపోయేరు ఇనస్పెక్టర్ విజయ్.
ఇంక విషయంలోకి వెళితే...
రాజన్న కు, నీలమ్మను బంగ్లా లో నిర్బంధిస్తున్నారని , అక్కడ వాచ్ మేన్ గా పని చేస్తున్న , పొరుగింటి లక్ష్మన్న ద్వారా తెలిసి , ఎలాగైనా సరే సాహబ్ తో మాట్లాడి, ఆమెను ఇంటికి తెచ్చుకోవాలని బయలుదేరేడు. లక్ష్మన్న బంగ్లా దగ్గరే ఉంటాడు కనక , రాజన్న మరెవరినీ తోడు తీసుకుపోలేదలుచుకోలేదు పిల్లలను లక్ష్మన్న భార్యకు అప్పచెప్పి బయలు దేరేడు.
అప్పటికి లాక్ డౌన్ ఇంకా సడలించ నందున , రాజన్న కు బంగ్లా దాకా పోవడానికి కుదరలేదు.అడుగడుగునా
కాపలా పోలీసుల తో దెబ్బలు తింటుానే విషయం వివరించడానికి ప్రయత్నించి విఫలమయ్యేడు.
రాజన్న , నీలమ్మను కాపాడుకోవాలన్న ఒకే ఒక తపన తో వారిని తప్పించుకొని పరుగెత్త సాగేడు. దాంతో రెచ్చిపోయిన పోలీసులు, తమ మాట వినలేదన్న కోపంతో రాజన్న ను దొరకపుచ్చుకొని ,కసిగా బాది , ఇంచు మించు తెలివి లేని స్థితిలో, రక్త సిక్తమైన రాజన్న ను ఒక చెట్టుకొంద పడీసేరు. ఆ కొట్టడంలో ఏ దెబ్బ ఎక్కడ తగిలిందో తిరిగి లేచిన రాజన్న వెర్రి వాడిలా, నీలమ్మొా ...నీలమ్మొా ...అని అరుస్తుా రోడ్లంట పరుగెత్త సాగేడు. గతం మరచిన రాజన్న ను పోలీసులు అతనిని , అక్కడికి దగ్గరలో ఉన్న క్వారంటైన్ కు తరలించేరు.
రాత్రి 9 గంటలకు లక్ష్మన్న ఇంటికి వచ్చి, రాజన్న అసలు బంగ్లాకు రానేలేదనీ, భార్య తో చెప్పేడు. రెండు రోజులు దాటినా రాజన్న ఇంటికి రానందున ,
పిల్లలను ఏం చేయాలో లక్ష్మన్న భార్యకు అర్ధం కాలేదు.
రాజన్న కుా , నీలమ్మ కుా, తమ వారైన దగ్గరి బంధువులు కుాడా ఎవరుా లేరు. దానికి తోడు వారం తర్వాత లక్ష్మన్న , బంగ్లాకు వెళ్ళిన గంట లోనే , తనను పనిలోంచీ తీసేసారని చెప్పేడు. ఎందుకు తీసీసేరో కారణం కుాడా తెలియలేదన్నాడు .
అసలు సంగతేంటంటే ....
అక్కడ పనిచేస్తున్న నర్సమ్మ , నీలమ్మ కు తమ సంగతి తెలిసి పోయింది కనుక , ఎప్పటికైనా తమకు ప్రరమాదమే అని , నీలమ్మ , లక్ష్మన్న ద్వారా వచ్చింది కనక , నీలమ్మ అతనితో తమ సంగతి చెప్పి , అతని సహాయం తీసుకునే అవకాసం ఎక్కువగా ఉన్నందున ముందుగా అతనిని ఇక్కడి పనిలోంచీ తొలగించేరన్న సంగతి, లక్ష్మన్నకు తెలీదు.
దాంతో కోలుకో లెేకపోయేరు భార్యా భర్తలు.
కరోనా కారణంగా , అన్ని చోట్లా " లాక్ డౌన్ " నడుస్తున్నాది. ఎక్కడా కుాలి పని కుాడా దొరకడం లేదు. రాజన్న జాడ లేదు. తమకే తిండి లేని సమయంలో మరో ఇద్దరి భారం మొాయ లేక , పిల్ల లను పస్తులుంచలేక , లక్ష్మన్న పోలీసులతో మాట్లాడి వారిద్దరినీ వాళ్ళకి అప్పగించేడు.
ఐతే ఆ పోలీసులు , పిల్లలను ఎక్కడుంచేరో కుాడా అతనికి తెలీదు. చేతిలో పనిలేని చాలా మంది ,నడుచు కుంటుా, తమ తమ స్వంత ఊళ్ళకు తరలిపోతున్నారు. వారిలో లక్ష్మన్న కుటుంబం కుాడా
ఒకరు. వారు ఏ ఊరు వెళుతున్నారో కుాడా ఎవరికీ తెలియలేదు. కారణం "కరోనా " భయంతోఎవరింట్లో వారు తలుపులు బిగించుకొని ఉండడం. "
అన్ని విషయాలుా తెలుసుకున్న ఇనస్పెక్టరు గారి మనసు కకావికలమైపోయింది.
ఇటువంటి పరిస్థితులను అడ్డం పెట్టుకొని, డబ్బు గణించడం కోసం, కొందరు దుర్మార్గులు చేసిన నిక్రుష్టపు పనుల వల్ల ఎంతమంది జీవితాలు ఛిన్నాభిన్నం అయిపోయాయి...
ఈ విషయాలు తను నీలమ్మకు ఎలా చెప్పగలడు..?
చెపితే ఆమె తట్టుకో గలదా...?
పసి పిల్లాడితో తరువాతి ఆమె జీవితం ఏమిటి...?
ఆలోచిస్తున్న కొద్దీ అసహనంగా ఉందతనికి.
--------------
సాయంత్రం కావస్తుాండగా ...నీలమ్మ దగ్గరికి వచ్చేరు ఇనస్పెక్టర్ విజయ్. అతను నీలమ్మకు ముందుగా ఏ విషయముా చెప్పదలుచుకోలేదు.
జైలు తలుపులు తీయబోయి, అక్కడే ఆగిపోయేడు.సబ్ ఇనస్పెక్టర్ విజయ్.
నీలమ్మ తను పొద్దున్న వెళ్ళి నప్పుడు , ఎక్కడ కుాలబడిందో అక్కడే ఉంది. అమె పైట జారిపోయి ఉంది. ఒక చేతి తో ఒడిసి పట్టుకున్న బాబు , అమె ఒడిలో విగతజీవియై పడి ఉన్నాడు . బాబు మెడ ఒక పక్క కు ఒరిగిపోయి ఉంది . బాబుకు పాలు పట్టేందుకు ప్రయత్నించినట్టుగా. .బాబు నోరు అమె స్తనాలకు దగ్గరగా ఉంది. గుండీలు విడిన జాకట్టు లోంచీ బయటకు వచ్చిన ఆమె ఎత్తైన స్తనాల లోంచి కారిన పాలు , ఆమె చీరను తడిపినట్టుగా , అక్కడక్కడా తడిసి ఉంది. ఆమె ఒక చేతిలో ఒక చిన్న పాల సీసా ఉంది . రెండవ సీసా జారి ఒక ముాలకు దొర్లి పోయింది .అమె ఊపిరి అగిపోయి ఎంతోసేపు కాలేదులా ఉంది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత మరోసారి తన అసమర్ధతను చాటుకుంది. ధనం గెలిచింది .ధర్మం ఓడిపోయింది.
న్యాయం అమ్ముడుపోయింది. మరో తల్లి ఆక్రోశం విశ్వాంతరాళాల్లో కలిసిపోయింది.
ఆ స్థితి లో నీలమ్మను చుాసిన పెద్దాయనకు కన్నీళ్ళు
ఆగలేదు. అతని కంటికి అర్ధనగ్నంగా కనిపిస్తున్న ఆమె వక్షోజాలు అమ్రుత కలశాల్లా కనిపిస్తున్నాయి.
ఆమెలో "అడ దానిని" మాత్రమే చుాస్తుా వెటకారాలాడిన పోలీసులకు , ఇప్పుడు
ఆమెలో ఆడతనానికి బదులు, "అమ్మ తనం "కనిపిస్తోంది . అస్తవ్యస్తమేన ఆమె అర్ధనగ్న త్వంలో , పిల్లవాడికి పాలు తాగించాలన్న ఆమె ఆత్రత ..... అందరికీ వారి వారి అమ్మలను, గుర్తుకొచ్చేలా చేసింది.
దాంతో అక్కడున్న పోలీసులు కొంతమంది టోపీలు తీసి , సిగ్గుతో తలలు వంచేరు .
నీలమ్మకు న్యాయం చేయలెేకపోయానన్న బాధతో
ఇనస్పెక్టర్ విజయ్ తల పట్టుకొని కుర్చీలో కుాలబడ్డారు.
కాటేసిన "కరోనా " విషపు జ్వాలల లో, చాలా మందితో పాటు , పచ్చని కలలు కన్న , నీలమ్మ జీవితం కుాడా అర్ధాంతరంగా ముగిసిపోయింది.
-----------------------
సమాప్తం.
-------------
ఆడవారిగా పుట్టిన పాపానికి ..
అమానుషంగా బలైపోయిన ఎందరో అమ్మలకు ,
అశ్రు నివాళితో , ఈ కధ అంకితం చేస్తుా....
రచయిత్రి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ).
---------------------
-----------
,