Tuesday, January 19, 2021

నంది తిమ్మన.

శీర్షిక: మణి మాణిక్యాలు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.


అల్లసాని పెద్దన , ధుార్జటి, రామభద్రుల వంటి
ఘన కవుల సమకాలీకులు నంది తిమ్మనగారు.
అఘొార శివాచార్యుల శిష్యులైన ఈతను
శ్రీక్రిష్ణదేవరాయలి  అస్థాన కవులైన
అష్ట దిగ్గజాల లో ఒకరైనవారు.
పారిజాతాపహరణం , వాణీవిలాసం వంటి
అద్భుత కావ్య రచనా ఘనులు.
నంది తిమ్మన, ఆరువేల నియోగ బ్రాహ్మణ కుటుంబంలో, నంది సింగన్న, తిమ్మాంబ దంపతులకు జన్మించాడు. జన్మతః శైవ కుటుంబీకులు.

 ఇతను రాయల భార్య తిరుమల దేవికి అరణంగా విజయనగరం వచ్చిన కవిగా వైష్ణవ సాంప్రదాయానికి
 చెందిన రాయల సంస్థానం లో ఉన్నందున 
 కొన్ని వైష్ణవ రచనలు కుడా చేసేరు.కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయల ఆస్థానంలో ఈయన తాతగారు నంది మల్లయ్య, మేనమామ ఘంట సింగన్నగారుా  జంటకవులుగా ఉండేవారు.

 సున్నితమైన, సులువైన పద్ధతిలో  చేసిన 
 నంది తిమ్మనగారి  రచనలు కేవలం పండితులకే కాక పామర జనులను సైతం విశేషంగా ఆకర్షిస్థాయి. అందువల్ల ఆయన రచనలను " ముక్కు తిమ్మన ముద్దు పలుకులు  అని  వ్యవహరిస్తారు .
 పారిజాతాపహరణంలో ఆయన రచించిన సుకుమారమైన శృంగార రసాత్మకమైన పద్యాలు ఇప్పటికీ పండితుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి.

పాత్రను బట్టి శైలిని మార్చడం, నాటకీయతను పొందుపరచడం, సామెతలు, సూక్తులు ప్రయోగించడం, సమయోచిత ఉపమానాలు ప్రయోగించడం, తెలుగు నుడికారాన్ని వాడడం, చమత్కారంగా చెప్పడం మొదలైనవి ఈతని 
రచనలలోని ప్రత్యేకతలు.
తిమ్మనగారి ముక్కు పెద్దది కావడం వలన 
ఆయనకి "ముక్కు తిమ్మన" అనే పేరు వచ్చిందంటారు. 
తిమ్మనగారు రాసిన పారిజాతాపహరణము” కావ్యం తెలుగు "పంచమహాకావ్యాలలో" ఒకటిగా పేరుగాంచింది.

 పారిజాతాపహరణం ఐదు ఆశ్వాసాల కావ్యం.
శ్రీక్రిష్ణ తులాభార ఘట్టాన్ని అద్భుత రచనా శైలి తో
వర్ణించిన సందర్భంలో 
నారదుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేసిన పది పద్యాలను నందితిమ్మన బంధకవిత్వముతో రాశారు.
ఈ క్రింది పద్యాలు చుాడండి.
 పద్యం:
నాయ శరగ సార విరయ
తాయన జయసార సుభగధర ధీ నియమా
మాయ నిధీ రధ గ భసుర
సారజనయ తాయరవిర సాగర శయనా!

ఈ పద్యం  లో  మొదటి రెండు పాదాలూ వెనక్కి తిరగేస్తే మూడు నాలుగు పాదాలు వస్తాయి. ఇలా రాసిన కంద పద్యాన్ని “అర్ధ భ్రమక కందము” అంటారు

రెండవ పద్యం –

క॥ ధీర శయనీయ శరధీ
మార విభానుమత మమత మనుభావిరమా
సార సవన నవసరసా
దారద సమ తారహార తామస దరదా

ఈ కంద పద్యంలో ప్రతి పాదం ముందు నుంచి చదివినా వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. దీన్ని “పాద భ్రమక కందము” అంటారు.

మూడవ పద్యం –

క॥ మనమున ననుమానము నూ
నను నీ నామమను మను మననమును నేమ
మ్మున మాన నన్ను మన్నన
మనుమను నానా మునీన మానానూనా

“న”, “మ” అనే రెండు హల్లులతోనే రాసిన ఈ కందాన్ని “ద్వ్యక్షరి కందము” అంటారు. ఈ పద్యంలో వృత్త్యానుప్రాస అలంకారం కూడా ఉంది.

ఈవిధంగా  అద్భుత మైన శైలి తో వివిధ  రీతుల లో 
రాసిన పద్యాలతో  పారిజాతాపహరణమే కాక 
 అష్ట దిగ్గజాల వంటి ఎంతో మంది కవులు , 
 వారు  రాసిన  ఎన్నో ప్రబంధ కావ్యాలు, మన దేశ  చరితకు  వన్నెతెచ్చిన మణి మాణిక్యాలు. 
ఇటువంటి కావ్య నిధికి,  సంస్కృుతి -సాంప్రదాయాలకు నిలయమైన మన దేశ సంపదను కాపాడుకోవడం
మన బాధ్యతకదుా...

No comments:

Post a Comment