Monday, February 17, 2020

మమతల మంటలు.(సంక్రాంతి పోటీల లో ప్రధమ బహుమతి పొందిన కవిత.).

మమతల కొలిమిలొ కాలుతున్న ఈ
మనసుకు ఏమని చెప్పేది
 సమతా మమతా  లేని జగతిలో
 మందును ఎవరిని అడిగేది...॥

రక్త సంబంధపు రాగములే...నడ-
యాడెను స్వార్ధపు చింతనలై...,
అర్ధము లెరుగని అవేశములై ,
అర్ధము కొరకు అనర్ధములై....॥

అమ్మా, అక్కా, చెల్లీ,. తమ్ముల  
బంధాలు బరువై  , పలచబడే !
అన్నలు ,అయ్యలే , వావీ వరుసల
బంధపు విలువకు శిలువేసే॥

నారీ చింతన నెగడై ఎగసే.
మనిషే మ్రుగమై చెలరేగే....
ఏసిడ్ దాడుల , కాలిన చావుల
కన్నీరె-ప్రళయమై-కోపించే ॥

చీకటి వెలుగుల జీవన గతిలో..చిరు-
నగవుల విలువలు దిగజారే ..
భార్యా బిడ్డల బాధ్యత , విధులే
బరువై  , బ్రతుకులే చితులాయే .. ॥..

అమ్రుతమె కరువై , విషపు జ్వాల లే
మింటికెగసె , హ్రుది మైలపడె..
మనిషే   మనిషికి , శత్రువు కాగా
"పగ" లే...మనిషికి  విధులాయే.॥

నాదీ -నీదను వాదపు సమరాన
రక్తమె ఝరులై  ప్రవహించే..
ధనమే జగతిని సాశించినదై...
వైరపు మంటల నెగదోసే ॥

మమతల మాటున మధన పడే
నా మనసుకు ఏమని చెప్పేదీ..?
ఎవరికి ఎవరుా కాని జగతిలో
ఎంత కాలమని బతికేది..॥

రగిలిన గాయపు మంటల నార్పగ
మందును ఎవరిని అడిగేదీ....॥
మమతల కొలిమిలొ కాలుతున్న ఈ
మనసుకు ఏమని చెప్పేది..॥
---------------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
---------------------------













No comments:

Post a Comment