✍️గురజాడ నవసమాజపు అడుగుజాడ🙏
అతడు అక్షరాలా.. ద్రష్ట
అసలైన తెలుగు మహాకవిగా ..
సిసలైన సంఘసంస్కర్తగా ..
తెలుగు నేల పై నడయాడిన స్రష్ట (బ్రహ్మ)
నవ్య కవిత్వానికి వేగుచుక్కలా..
ఆధునికాంధ్ర సాహిత్యపు చుక్కానిలా ..
కొత్తపాతల కలయికతో...
తెలుగువారి మూఢాచారాలమత్తును...
సుతిమెత్తగా వదల గొట్టిన...
భావవిప్లవానికి అతడిదే..తొలి అడుగుజాడ
సాంఘిక సంస్కరణకు చైతన్యం ..
అతడు సృష్టించిన *కన్యాశుల్కం*
*సారంగధర* గా అవతరించెను..
అతని ఆంగ్ల పద్య కవనం.
కులం కన్నా గుణం మిన్నా అంటూ
రాచరిక లోపాలను, స్త్రీదుస్థితిని ..
చూపించెను అతని *కన్యక* ఆత్మత్యాగం
గిడుగు వారి భాషోద్యమానికి..
అడుగు వేసిన నాయకుడై..
*ముత్యాల సరాల* తో నవ్యచందస్సుకు
నాంది వేసిన నవయుగ వైతాళికుడై...
*దేశమును ప్రేమించుమన్నా*
*మంచి అన్నది పెంచుమన్నా*
అని పెద్దల్ని మందలిస్తూనే...
*ఏనుగెక్కి మనము ఏ ఊరు వెళ్దాం* ?
అంటూ *మిణుగురుల* తెలుగు వెలుగులో
పిల్లలకు ప్రేమను పంచాడు.
అతనిభావ నవ్యత కి రసపోషణ కి
నిలువుటద్దం పుత్తడి బొమ్మ *పూర్ణమ్మ*
తెగువను, అణకువ కలుగు స్త్రీపాత్రల
వైరుధ్యం *మధురవాణి బుచ్చమ్మ* .
మానవతావాదిగా ..
సామాజిక సారథిగా..
సాహిత్య వారధిగా...
దేశభక్తిని ,సాహిత్య శక్తిని..
తన రక్తంలో,తన సిరలో నింపుకొని..
కలాన్ని కత్తిలా పదునుపెట్టి..
మూఢాచారాలను,అస్పృశ్యతను
తెగనరికిన సామాజిక సైనికుడతడు.
*బ్రతికి చచ్చియు ..ప్రజల కెవ్వడు*
*బ్రీతి కూర్చునో..వాడే ధన్యుడు*
✍️దేశపతి మోహన్ శర్మ టీచర్ మెదక్
కవిత సంఖ్య :338
No comments:
Post a Comment